calender_icon.png 25 October, 2024 | 4:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనంతసాగర్‌లో.. అక్రమంగా చెట్ల నరికివేత

29-08-2024 12:00:00 AM

  1. స్థానికంగా ఉన్న కంపెనీకి కలప తరలింపు 
  2. సొమ్ము చేసుకుంటున్న దళారులు 
  3. పట్టించుకోని అధికారులు

చేగుంట, ఆగస్టు 28: మెదక్ జిల్లా చేగుంట మండలం అనంతసాగర్ గ్రామంలో కొందరు దళారులు డబ్బు సంపాదనే ధ్యేయంగా అక్రమంగా చెట్లను నరికి, కలపను స్థానికంగా ఉన్న కంపెనీకి తరలిస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో వన మహోత్సవం పేరిట ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతుంటే ఇక్కడ అక్రమార్కులు చెట్లను నరికివేస్తూ కలప రవాణా చేస్తున్నారు.

అనంతసాగర్ గ్రామ పరిధిలోని చెరువులు, కుంటల వద్ద పెరిగిన చెట్లను నరికివేస్తూ గ్రామ శివారులో ఉన్న జీవీకే కంపెనీకి అమ్ముకుంటున్నారు. ప్రతిరోజు రాత్రి వేళల్లో ఈ దందా కొనసాగిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఒక్క ట్రాక్టర్ లోడ్‌కు రూ.30వేల నుంచి 40వేల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఫారెస్టు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా దళారుల ఇచ్చే మామూళ్లు తీసుకుని చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటికైన తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఎలాంటి అనుమతి ఇవ్వలేదు

అనంతసాగర్ గ్రామ శివారులో ఉన్న చెట్ల నరికివేతకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. అక్రమంగా కలప తరలింపు విషయం నా దృష్టికి రాలేదు. చెట్లను అక్రమంగా నరుకుతున్న వారిపై చర్యలు తీసుకుంటాం. 

 సునంద, పంచాయతీ కార్యదర్శి, అనంతసాగర్