22-04-2025 10:31:49 PM
20 లక్షల 69 వేల 829 ఆదాయం..
హుజురాబాద్ (విజయక్రాంతి): ప్రసిద్ధ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో 2025 శ్రీరామనవమి జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా వేసిన హుండీల లెక్కింపు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ లెక్కింపు ద్వారా మొత్తం రూ.20,69,829 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
12 గ్రాముల మిశ్రమ బంగారం, 305 గ్రాముల మిశ్రమ వెండి, విదేశీ కరెన్సీగా 225 అమెరికన్ డాలర్లు, 15 అరబ్ దిర్హామ్లు, 1 కువైట్ దినార్, 5 చైనా యువాన్లు, 1000 జపాన్ యెన్లు లభించాయి. గత సంవత్సరం హుండీ ఆదాయంతో పోల్చితే ఈ సంవత్సరం రూ. 2,94,257/- అధికంగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి.సత్యనారాయణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ, కరీంనగర్ డివిజన్ పి.సత్యనారాయణ, కార్యనిర్వాహణాధికారి కే సుధాకర్, రీనోవేషన్ కమిటీ చైర్మన ఇంగిలే రామారావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.