calender_icon.png 19 April, 2025 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైత్రీమూవీ మేకర్స్‌కు ఇళయరాజా లీగల్ నోటీసులు

16-04-2025 12:00:00 AM

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కుమార్ కథానాయకుడిగా దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన సినిమా ‘గుడ్‌బ్యాడ్‌అగ్లీ’. ఈ యాక్షన్ కామెడీ చిత్రం ఈ నెల 10న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మ ప్రాజెక్టుగా భావిస్తూ టాలీవుడ్ కేంద్రంగా పనిచేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. టీ -సిరీస్ గుల్షన్‌కుమార్, భూషణ్‌కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టిన చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం. ఈ చిత్ర నిర్మాతలు తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు.

ఈ సినిమా నిర్మాతలకు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా లీగల్ నోటీసులు పంపారు. గతంలో తాను స్వరాలు సమకూర్చిన మూడు గీతాలను ‘గుడ్‌బ్యాడ్‌అగ్లీ’లో అనుమతి లేకుండా రీ క్రియేట్ చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. అందుకుగానూ రూ.5 కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే ఆ పాటలను తొలగించి, మేకర్స్ క్షమాపణ చెప్పాలని కోరారు.

తన నోటీసులపై ఏడు రోజుల్లోగా స్పందించకపోతే లీగల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘నట్టుపుర పట్టు’ చిత్రంలోని ‘ఓథా రూబైయుమ్ తారేయిన్’, ‘విక్రమ్’ సినిమాలోని ‘ఎన్ జోడి మంజల్ కురివి’, ‘సకల కళా వల్లవన్’ మూవీలోని ‘ఇలమై ఇధో ఇధో’ వంటి పాటలను నిర్మాతలు తాజాచిత్రం ‘గుడ్‌బ్యాడ్‌అగ్లీ’లో వాడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

ఇవన్నీ ఇళయరాజా స్వరపరిచిన పాటలే. అనుమతి లేకుండా తన పాటలను వాడుకున్నందుకు ఆగ్రహించిన ఇళయరాజా.. మైత్రి నిర్మాతలకు గట్టి షాకిచ్చినట్టు తెలుస్తోంది. ఇళయరాజా నిరుడు మలయాళ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలకు సైతం ఇలాగే లీగల్ నోటీసులు పంపారు. ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ప్రచారం చేసుకుంటున్న నిర్మాతలు నవీన్ యెర్నేని, రవికుమార్ యలమంచిలి.. ఇలా అను‘మతి’లేని పనులకు పాల్పడటమేమిటని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.