10-03-2025 01:05:40 AM
ఎక్కువ మాట్లాడితే మహిళా సంఘం నుంచి తొలగిస్తాం
మహిళా సభ్యులకు గ్రూప్ లీడర్, ఆర్పీల బెదిరింపు
గజ్వేల్, మార్చి 9: లంచం ఇస్తేనే డ్వాక్రా లోన్ ఇస్తామని, లేకపోతే సంఘం నుంచి తొలగిస్తామంటూ సంఘం లీడర్లు, ఆర్పీలు బెదిరించారని గజ్వేల్ పట్టణానికి చెందిన అయేషా మహిళా సంఘం సభ్యులు యాస్మిన్, రహీమున్నీసాలు పత్రికా విలేకరులతో ఆదివారం తమ ఆవేదన వ్యక్తం చేశారు. గజ్వేల్ పట్టణానికి చెందిన 8 మంది మహిళా సభ్యులు గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ లక్ష్మాపూర్ కి చెందిన ఇద్దరు మహిళా సభ్యులతో కలిసి 5సంవత్సరాల క్రితం అయేషా మహిళా సంఘం ఏర్పాటు చేసుకు న్నారు. గత సంవత్సరం మే 30 న ఈ సంఘానికి కి రూ.6 లక్షలు లోన్ మంజూరయ్యింది.
ఈ లోన్ విషయంలో అయేషా మహిళా సంఘం సభ్యులైన ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన యాస్మిన్, రహీమున్నీసాలు గ్రూప్ లీడర్ శభానను అడగగా లోన్ కావాలంటే ఇద్దరు సభ్యులు కలిసి రూ.5 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు వారు తెలిపారు. ఎందుకు ఇవ్వాలని అడగగా మీరు నాన్ లోకల్ అని మీరు మీటింగ్ కి సరిగా రావడం లేదు కాబట్టి రూ.5వేలు ఇస్తేనే లోన్ వస్తదని బెదిరించినట్లు చెప్పారు. ఎక్కువ మాట్లాడితే గ్రూప్ నుండి తీసివేస్తామని దబాయించినట్లు తెలిపారు. అయేషా మహిళా సంఘానికి మంజూరైన రూ. 6 లక్షలను ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన ఇద్దరు సభ్యులకు తెలియకుండా తీర్మానం లెటర్ పై వారి దొంగ సంతకాలతో బ్యాంకు మేనేజర్ తో కుమ్మక్కై 8 మంది మహిళా సభ్యులు పంచుకున్నారని ఆరోపించారు.
ఇదే విషయంపై ఆర్పీ జ్యోతిని అడగగా గ్రూప్ లీడర్ శభాన చెప్పినట్లు రూ.5వేలు ఇస్తే లోన్ వస్తుండే కదా అంటూ నిర్లక్ష్యపు సమాధానం చెప్పినట్లు తెలిపారు. గతంలో కూడా స్త్రీనిది లోన్ కోసం రూ.2000 వేలు తీసుకుందని, మరోసారి లంచం ఇవ్వకపోవడంతో స్త్రీనిది లోన్ ఇప్పించక పోగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వలేదన్నారు. సంఘం లీడర్ శభాన, ఆర్పీ జ్యోతి వసూళ్లపై మెప్మా అధికారి సరితకు పిర్యాదు చేసిన స్పందించకపోవడంతో ఈనెల 6వ తేదీన బాధితులు మెప్మా పీడీ హన్మంతరెడ్డికి పిర్యాదు చేశారు. సమస్యను విన్న ఆయన వారికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.