- ఆపరేషన్ విఫలమై వ్యక్తి మృతి
- హనుమకొండ దవాఖాన ఎదుట బాధితుల ఆందోళన
హనుమకొండ, ఆగస్టు 29 (విజయక్రాంతి) : రోడ్డు ప్రమాదంలో గాయపడి కాలు సర్జరీ కోసం దవాఖానలో చేరిన వ్యక్తి నాలుగు రోజుల తర్వాత శవమై తిరిగొచ్చిన ఘటన గురువారం వరంగల్ జిల్లాలో కలకలం రేపింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడ ని ఆరోపిస్తూ బాధిత కుటుంబం ఆరెపల్లిలోని దవాఖానలో ఆందోళననకు దిగింది. వివరాల్లోకి వెళ్తే.. హసన్పర్తి మండలం ము చ్చర్ల నాగారానికి చెందిన హరిప్రసాద్ (55) గత ఆదివారం ములుగు జిల్లాలో ఓ ఫంక్షన్కు హాజరై బైక్పై తిరిగొస్తుండగా మార్గమధ్యలో పందికుంట వద్ద ట్రాక్టర్ ఢీ కొట్టింది.
ప్రమాదంలో హరిప్రసాద్ కాలు విరగడంతో ఆరెపల్లిలోని అపోలో ఆస్పత్రి లో చికిత్స కోసం చేర్పించారు. ఆపరేషన్ చేయాలని ప్యాకేజీ మాట్లాడుకుని మరుసటి రోజు సర్జరీ చేశారు. ఆపరేషన్ ఫెయిల్ కావడంతో మరోసారి సర్జరీ చేశారు. అయినప్పటికీ కుదుట పడకపోగా బాధితుడు బుధవారం రాత్రి మృతిచెందాడు. బాధితులు గురువారం దవాఖానకు చేరుకుని ఆందోళనకు దిగారు. వైద్యులు, హాస్పిటల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్న బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. ఘటనపై విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో బాధితులు ఆందోళన విరమించారు.