calender_icon.png 23 October, 2024 | 1:44 PM

స్పీకర్‌కు గడువు విధిస్తే..?

07-08-2024 01:59:16 AM

  1. అడ్వొకేట్ జనరల్‌కు హైకోర్టు ప్రశ్న
  2. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై విచారణ 

హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కేసులో స్పీకర్ నిర్దిష్ట సమయంలోగా నిర్ణయం తీసుకోవాలనే గడువు విధిస్తే ఎలా ఉంటుందని అడ్వొ కేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డిని హైకోర్టు ప్రశ్నించింది. మణిపూర్ ఎమ్మెల్యేల కేసులో సు ప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ ఆదేశాల మేరకు గడువు విధిస్తే ఎలా ఉం టుందో చెప్పాలని కోరింది.

స్పీకర్‌కు కోర్టు లు ఆదేశాలు జారీ చేయరాదన్నదే తమ వాదనని, అలాంటి గడువు ఉత్తర్వుల జారీకి వీల్లేదని ఏజీ తేల్చిచెప్పారు. మరో సీనియర్ లాయర్ జంధ్యాల రవిశంకర్ కల్పించుకొని.. స్పీకర్ ముందున్న పిటిషన్లను విచారణ చేయాలని ఇప్పటివరకు సుప్రీంకోర్టు తీర్పు లు చెప్పలేదని అన్నారు.

పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు కల్పించుకొని, మణిపూర్ ఎమ్మెల్యేల కేసు లో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని 142 అధికరణం కింద స్పీకర్‌కు నోటీసులు జారీ చేసిందని చెప్పారు. స్పీకర్‌కు ఆ తరహా ఉత్తర్వులు హైకోర్టు ఇవ్వొచ్చునని చెప్పారు.

బీఆర్‌ఎస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం  వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్‌సేనారెడ్డి మంగళవారం విచారణ కొనసాగించారు. 

రాజ్యాంగ విధులను స్పీకర్ అపహాస్యం

స్పీకర్ రాజ్యాంగ విధులను అపహాస్యం చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాడి గండ్ర మోహన్‌రావు అన్నారు. ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో ఫిరాయింపుల పిటిషన్‌పై చర్యలు తీసుకోకుండా స్పీకర్ కాలయాపన చేస్తున్నారని అన్నారు. చట్టసభ అధిపతిగా రాజ్యాంగ హక్కులను కాపాడాల్సిన స్పీకర్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఒకరు అధికార కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత కూడా స్పీకర్ తీరులో మార్పు రాకపోవడాన్ని తప్పుపట్టారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం స్పీకర్‌కు కోర్టులు (హైకోర్టు/సుప్రీంకోర్టు) ఆదేశాలు జారీ చేయవచ్చునని వాదించారు. దీనికి సంబంధించిన పలు తీర్పులను ఉదహరించారు.

అధికార పార్టీ ఎమ్మెల్యేల మద్దతుతో స్పీకర్ ఎన్నిక అవుతారని, పార్టీ ఫిరాయింపుల కేసులో ఉత్తర్వులు జారీ చేసేందుకు సంశయనికి ఆస్కారం లేకుండా ఉండాలంటే హైకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. స్పీకర్ కార్యాలయంలో పిటిషన్ దాఖలు చేసిన పది రోజుల తర్వాతే హైకోర్టుకు వచ్చామని, పిటిషనర్లు తొందర పడుతున్నారంటూ ప్రతివాదులు చేస్తున్న వాదనను తప్పుపట్టారు.

హైకోర్టు కేసు తర్వాతే స్పీకర్ కార్యాలయం పార్టీ ఫిరాయింపు పిటిషన్లను తీసుకుందని గుర్తు చేశారు. ఫిరాయింపు పిటిషన్లపై స్పీకర్ చర్య లు తీసుకోకుంటే ప్రజాస్వామ్యానికి అర్థమే లేకుండాపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. స్పీకర్ నిర్ణయం తీసుకున్నాకే కోర్టుల న్యాయ సమీక్షకు వీలుందని ఏజీ చెప్పారు.

దానం తరఫు సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదనలు వినిపిస్తూ.. మణిపూర్ ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని 142 అధికరణ కింద ఉత్తర్వులు ఇచ్చిందని, ఆ తీర్పుకు కట్టుబడి ఉండాలని లేదని అన్నారు. తదుపరి విచారణ బుధవారానికి వాయి దాపడింది.

జైళ్లలోని ఖైదీలు, విచారణ ఖైదీల వివరాలివ్వండి 

హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): జైళ్లలోని ఖైదీలు, విచారణ ఖైదీల వివరాలు అందజేయాలని జైళ్ల శాఖకు హైకోర్టు పీపీ కార్యాలయం లేఖ రాసింది. వారి ఆరోగ్య పరిస్థితి, బెయిల్ పిటిషన్ల వివరాలు, కేసులకు సంబంధించిన అన్ని వివరాలు వీలైన ంత త్వరగా నివేదించాలని కోరింది.

తల్లిని హత్య చేసిన కేసులో 2013లో మెదక్ జిల్లా పెద్దగుండెల్లికి చెందిన పోచయ్యకు ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించగా.. మూడు రోజు ల క్రితం హైకోర్టు నిర్దోషిగా తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ తీర్పుకు ఆరేళ్ల ముందే జైలులో పోచయ్య మృతిచెందడం.. ఆ వివరాలు కోర్టుకు తెలియక పోవడం చర్చనీయాంశంగా మారింది.

న్యా యస్థానాలపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉండటంతో ఈ అంశంపై హైకోర్టు దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పీపీ కార్యాలయం హైకోర్టులో పిటిషన్‌లు ఉన్న వారి వివరాలన్నీ పంపాలని జైళ్ల శాఖకు లేఖ రాసింది.