24-04-2025 07:15:51 PM
తొర్రూర్ డిఎస్పి కృష్ణ కిషోర్..
మహబూబాబాద్ (విజయక్రాంతి): నాటు సారా తయారీకి వినియోగించే నల్ల బెల్లం, పటిక విక్రయాలను మానుకోకపోతే పీడీ యాక్ట్ అమలు చేస్తామని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్(DSP Krishna Kishore) నల్ల బెల్లం వ్యాపారులను హెచ్చరించారు. మరిపెడ పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం నల్ల బెల్లం వ్యాపారులకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో నాటు సారాను పూర్తిగా నిర్మూలించడానికి పోలీసులు చేస్తున్న కృషికి సహకరించాలని పిలుపునిచ్చారు.
గుడుంబా వినియోగం వల్ల అనేకమంది అకాల మృత్యువాత పడుతున్నారని, కుటుంబ పెద్ద మరణంతో ఆయా కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారుతోందని చెప్పారు. నాటు సారా తయారీని సంపూర్ణంగా నిరోధించడానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ కు వచ్చే సందర్శకులు, ఫిర్యాదుదారులకు వేసవికాలం సందర్భంగా చల్లని త్రాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన వాటర్ కూలర్ ను డీఎస్పీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిఐ రాజకుమార్, ఎస్సై లు బొలగాని సతీష్, సంతోష్ పాల్గొన్నారు.