calender_icon.png 16 April, 2025 | 7:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే కాంగ్రెస్‌కు పరాభవమే!

16-04-2025 01:17:55 AM

  1. అప్పులు.. మద్యం అమ్మకాలతోనే పాలన
  2. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయాలని మాకు లేదు..
  3. సర్కార్‌పై ప్రజావ్యతిరేకత మాత్రం వాస్తవం..
  4. భూములు కబ్జా చేసిన మజ్లిస్ నేతలకే వక్ఫ్‌పై చింత
  5. త్వరలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక
  6. మీడియా చిట్‌చాట్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): తెలంగాణలో అప్పులు, మద్యం అమ్మకాలతోనే పాలన సాగుతున్నదని, రాష్టప్రభుత్వం సర్కార్ భూములను సైతం అమ్మేందుకు సిద్ధపడడం శోచనీయమని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఉద్ఘాటించారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రె స్ పార్టీని కూలదోయాలనే ఆలోచన తమకు లేదని, ఈ ప్రభుత్వం మరో మూడేళ్లూ కొనసాగాలని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత వచ్చిందనేది వాస్తవమని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని చవిచూడాల్సి వస్తుందని జోస్యం చెప్పారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల తమ పార్టీకి బలం లేకపోయినా, గెలుస్తామనే నమ్మకం ఉందని వెల్లడించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీకి ఉమ్మడిగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీనే బాస్ అని ఆరోపించారు.

ఎంఐఎం బీజేపీని దెబ్బతీసేందుకు నిన్నమొన్నటివరకు బీఆర్‌ఎస్ నుంచి సూటికేసులు తీసుకున్నదని ఆరోపించారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు అమలుపై ముస్లింలు ఆందోళన చెందడం లేదని, భూములు కబ్జా చేసిన మజ్లిస్ నేతలు, అక్రమార్కులే చింతిస్తున్నారని దుయ్యబట్టారు. వక్ఫ్‌బోర్డు అంశాన్ని తమ పార్టీ మేనిఫెస్టోలో పెట్టామని, ఆ హామీ మేరకే నెరవేర్చామని వివరించారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చిన బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తేల్చిచెప్పారు.

వక్ఫ్ బోర్డుకు మసీదులకు సంబంధం లేదని, మసీదులు, ఆలయాలకు వచ్చే ఆదాయంతో వక్ఫ్ వ్యవహారాన్ని పోల్చవద్దని హితవు పలికారు. తమిళనాడులో గతంలోనూ ఏఐడీఎంకేతో తమకు పొత్తు ఉండేదని, అది కొత్త విషయమేమీ కాదని, తాజాగా ఆ పార్టీతో పొత్తును పునరుద్ధిరించామని స్పష్టం చేశారు. డీలీమిటేషన్‌పై లేనిపోని ప్రచారం జరుగుతున్నదని, దక్షిణాదిపై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదని తెలిపారు.

రాజాసింగ్ వ్యవహారం.. పార్టీ అంతర్గతం...

ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు, వ్యవహార శైలిపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. రాజాసింగ్ వ్యవహారం పార్టీ అంతర్గత విషయమని, తమలో తాము చర్చించుకుని సమస్యలను పరిష్కరించుకుంటామని కేంద్ర మంత్రి తెలిపారు. బీజేపీ ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పార్టీ బలహీనంగా ఉందని గుర్తించామని, అక్కడ కూడా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

పాత బస్తీలో 90శాతం హిందువుల కాలనీలు ఖాళీ కావడం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. కొన్నిప్రాంతాల్లో చాపకింద నీరులా ఎంఐఎం బలోపేతం అవుతున్నదన్నారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారితో ఎంఐఎం అంటకాగుతుందని ఆరోపించారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే  కేంద్ర మంత్రి గడ్కరీ చేతుల మీదుగా రాష్ట్రంలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఫ్లుఓవర్లను ప్రారంభింపజేస్తామన్నారు.

హెచ్‌సీయూ భూముల అంశంలో తాను సోషల్‌మీడియాలో చేసిన చిత్ర ఏఐ చిత్రం కాదని, ఒకవేళ అది ఏఐ చిత్రమని ఎవరైనా అంటే.. కేసులు ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని వెల్లడించారు. సదరు భూములో అర్ధరాత్రి లైట్లు వేసి మరీ చెట్లు నరకాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏం వచ్చిందని నిలదీశారు.

హెచ్‌సీయూ భూముల రుణం వెనుక ఓ బీజేపీ ఎంపీ ఉన్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల మీడియా ఎదుట వెల్లడించారని, ఆ  చక్రం తిప్పిన ఎంపీ ఎవరో బాహాటంగా ప్రకటిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

సర్కార్ సొంతంగా సన్నబియ్యం ఇవ్వాలి..

రేషన్‌కార్డు లబ్ధిదారులకు కేంద్రం ఇస్తున్న సన్నబియ్యంతో పాటు రాష్ట్రప్రభుత్వం కూడా సొం తంగా ఇవ్వాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. రేషన్ కేంద్రాల నుంచి జారీ అయ్యే రశీదును చూస్తే కేంద్రం వాటా ఎంతో, రాష్ట్రం వాటా ఎంతో ప్రజలకు ఇట్టే తెలిసిపోతుందని వ్యాఖ్యానించారు.

పన్నుల రూపంలో కేంద్రానికి తెలం గాణ నుంచి భారీ సొమ్ము వెళ్తుందని సీఎం, మంత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, వారి వ్యాఖ్యలు హా స్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఆ పన్నుల ప్రజలు చెల్లించేవే కానీ.. సీఎం లేదా మంత్రుల జేబుల నుంచి వెళ్లడం లేదనే సంగతి గుర్తుపెట్టుకోవాలన్నారు.

హైదరాబాద్‌లో మెట్రో విస్తరణ అంశంపై కేంద్రం అధ్యయనం చేస్తున్నదని, ఆ తర్వాతే కేం ద్రం దీనిపై ఓ నిర్ణయానికి వస్తుందని స్పష్టం చేశా రు. విస్తరణకు రూ. 85వేల కోట్లు అవసరమని రా ష్ట్ర ప్రభుత్వం కోరిందని, కానీ.. తమ అధ్యయనం లో రూ.65 వేల కోట్లతో పూర్తవుతుందని తేలింద ని వెల్లడించారు.