21-04-2025 01:36:28 AM
50 ఏళ్ల ప్రయాణం పుస్తకావిష్కరణలో మాజీ మంత్రి హరీశ్రావు
హైదరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): రాజకీయాల్లో చాలామంది ఆదర్శ మైన మాటలు మాట్లాడతారని, కానీ ఆదర్శవంతమైన జీవితాన్ని పాటించిన వ్యక్తి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అని మాజీ మంత్రి హరీశ్రావు కొనియాడారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన కొప్పుల ఈశ్వర్ 50 ఏళ్ల ప్రయాణం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో హరీశ్రావు మాట్లాడారు.
రాజకీయాల్లో ఉన్నవారు, రాజకీయాల్లోకి రావాలనుకునే వారు తప్పకుండా ఈ పుస్తకాన్ని చదవాలని ఆయన సూచించారు. తామంతా కేసీఆర్ నాయకత్వలో తెలంగాణ ఉద్యమంలో పనిచేశామని, కానీ కార్మిక ఉద్యమం, విప్లవ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఇలా మూడు ఉద్యమాల్లో పని చేసిన ఘనత కొప్పుల ఈశ్వర్దని తెలిపారు.
మూడు ఉద్యమాల్లో జైలుకి వెళ్లిన వ్యక్తిగా కొనియాడారు. కూలీ నుంచి క్యాబినెట్ మంత్రి వరకు ఆయన ప్రస్థానాన్ని అద్భుతంగా వివరించిన పుస్తక రచయిత మల్లన్నను అభినందించారు. కేసీఆర్ లేని లోటుని తెలంగాణ ఎలా బాధపడుతుందో ధర్మపురి ప్రజలు కూడా ఈశ్వర్లేని నియోజకవర్గాన్ని చూసి బాధపడుతున్నారని తెలిపారు. నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు పాటుపడిన కొప్పుల ఈశ్వర్ను ఈ తరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని హరీశ్రావు అన్నారు.