calender_icon.png 5 October, 2024 | 6:56 AM

నేనే కూల్చుకుంటా

05-10-2024 02:55:03 AM

ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో నా ఫాంహౌస్ భూమి ఒక అంగుళం ఉన్నా మార్క్ చేయండి  

నాకు ఎలాంటి మినహాయింపులు వద్దు 

సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు లేఖ 

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి) : హైదరాబాద్‌లోని అజీజ్ నగర్‌లో తన కుటుంబసభ్యుల పేరు మీదున్న ఫాంహౌస్ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఒక్క అంగుళం ఉన్నట్లు అధికారులు సర్వేలో తేల్చినట్లయితే 48 గంటల్లో సొంత ఖర్చులతో కూల్చేస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు తెలిపారు.

తన కుటుంబ సభ్యులపై ఉన్న ఫాంహౌస్‌పై ప్రతిపక్ష నాయకులు పదేపదే ఆరోపణలు చేస్తున్నారని, సీఎం రేవంత్‌రెడ్డి భుజంపై తుపాకీ పెట్టి తనను కాల్చాలని, తద్వారా సీఎంను ఇరుకునపెట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డికి మూడు పేజీల లేఖను రాశారు.

బీఆర్‌ఎస్ నాయకులు తనపై ఆరోపణలు చేసినప్పుడు.. ఫాంహౌస్ అక్రమని తేలితే కూల్చేస్తానని గతంలో చెప్పానని, ఇప్పటికీ ఆ మాటకు తాను, తన కుటుంబ సభ్యులు కట్టుబడి ఉన్నారని తెలిపారు. ‘కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నాకు ఎలాంటి మినహాయింపులు వద్దు, సాధారణ పౌరుడి విషయంలో చట్టం ఏ విధంగా వ్యవహరిస్తుందో అదే నాకు వర్తింపచేయాలి.

నేను నిప్పులాంటి వాడిని, చెడ్డపేరు తేవడం అనేది తన, కాంగ్రెస్ రక్తంలోనే ఉండదు. చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉండాలని, దానికి మీరు గానీ నేను గానీ అడ్డు చెప్పకూడదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన, సుందరీకరణను నేను స్వాగతిస్తున్నాను’ అని  ఆ లేఖలో కేవీపీ పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి చెడు పేరు రాకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. మార్కింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని ఆశిస్తున్నట్లు  తెలిపారు. ఆ మార్కింగ్ చేసే సమయం, తేదీ ముందే ప్రకటిస్తే తనపై పదే పదే ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులు, వారి అనుకూల మీడియా కూడా వచ్చి ఈ ప్రక్రియను వీక్షించే అవకాశం ఉంటుందని సీఎంకు రాసిన లేఖలో కేవీపీ వివరించారు. 

ఆశయాన్ని దెబ్బతీసే ప్రయత్నం

మొదటి దశలో మూసీ ప్రక్షాళన, రెండో దశలో సుందరీకరణ చేపడితే బాగుంటుందని, ఆ విషయాన్ని సీఎంకు సూచించాలని పార్టీ శ్రేయోభిలాషులు తనతో  చెప్పారన్నారు. సీఎం విజన్, ఆసక్తిని గమనిం చానని, అందుకే ఆయన దృష్టికి తీసుకెళ్లలేదన్నారు.  పేదలకు నష్టం కలుగకుండా ప్రభుత్వం చేపట్టే అన్ని పనులనకు ఒక క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

1980 నుంచి హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పర్చుకున్నానని, అప్పటి నుంచి  ప్రతి ఎన్నికల్లో ఓటర్‌గా పాల్గొంటున్నానని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు. తన మిత్రులకు, శ్రేయోభిలాషుల సహకారంతో వనరులు సమకూర్చుతూ వారి గెలుపునకు కృషి చేసినట్లు తెలిపారు. 

అయితే ఈ ప్రాజెక్టు విషయంలో బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు, వారి పెంపుడు మీడియా.. పేదలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడటం.. వారి స్వప్రయోజనాల కోసమేనని కేవీపీ ఆరోపించారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీలు, పేదల అభివృద్ది, సంక్షేమం కాంగ్రెస్ పార్టీ మౌళిక సిద్ధాంతమన్నారు.

మూసీ విషయంలో ప్రతిపక్షాలది మోసలి కన్నీరేనని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో సీఎం ఆశయాన్ని దెబ్బతీయడానికి, వారి చేసే ప్రయత్నాలను ఖండిస్తున్నట్లు చెప్పారు. పేదల కోసం చేసే మంచి పనులను  విపక్షాలు దెబ్బతీసే కుట్రలు చేస్తున్నాయని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

పార్టీకి నష్టం కలిగించే పని చేయను

క్రమ శిక్షణ, నిబద్ధత కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా ప్రాంతాలకు అతీతంగా జాతీయపార్టీ అయిన కాంగ్రెస్ బలోపేతానికి తన శాయశక్తులా పనిచేస్తానని తెలిపారు. తన వల్ల పార్టీకి నష్టం కలిగించే ఏ పని తాను చేయనని, చేయలేనని స్పష్టం చేశారు. తను, డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దాదాపు మూడు దశాబ్దాల క్రితం 1996లోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు, తన తుది ఊపిరి ఉన్నంతవరకు ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన లేఖలో కేవీపీ పేర్కొన్నారు.

1984 నుంచి ఇప్పటీ వరకు ఏఐసీసీ సభ్యుడిగా ఉంటూ దాదాపు 5 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో నిబద్ధత కలిగిన కార్యకర్తగా కొనసాగుతున్నట్లు తెలిపారు. పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని, ప్రభుత్వం తీసుకునే ప్రతి కార్యక్రమాన్ని,  పథకాన్ని త్రికరణ శుద్ధిగా సమర్ధిస్తానని వివరించారు.  ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను చిత్తశుద్ధ్దితో అమలుచేయడానికి శాయశక్తులా కృషి చేస్తానని.. ఇవాళ  ఓ  కాంగ్రెస్ సీఎంకు చెప్పాల్సి రావడం బాధకరమే అయినా తప్పలేదని  ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.