calender_icon.png 7 October, 2024 | 4:54 AM

నా ఇష్టాయిష్టాలను పిల్లలపై రుద్దను

07-10-2024 12:07:36 AM

టాలీవుడ్‌లో వారసులకేమీ కొదువ లేదు. అయితే వారసత్వం అనేది సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే వరకే ఉంటుంది. ఆ తరువాత వారసత్వం పని చేయదు. కష్టమే ఇండస్ట్రీలో నిలబెడుతుంది. అలా కష్టపడి పని చేసిన వారే జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ తదితరులు స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటించిన ‘దేవర‘ చిత్రం మంచి సక్సెస్ సాధించింది.

ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్‌లో భాగంగా లాస్ ఏంజిల్స్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా తన కుమారులు అభయ్, భార్గవ్‌ల తెరంగేట్రంపై అక్కడి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. భవిష్యత్‌లో మీ తనయులను సినీ పరిశ్రమలోకి తీసుకొస్తారా? అని అక్కడి మీడియా ప్రశ్నించగా, తన అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలను వారిపై రుద్దబోనన్నారు.

పిల్లలకు ఏం చేయాలనే సొంత ఆలోచన ఉండాలని.. అలా ఆలోచించగలిగే వాతావరణాన్ని మనమే కల్పించాలన్నారు. తన తనయులిద్దరి వయసులో చాలా వ్యత్యాసం ఉందని ఎన్టీఆర్ తెలిపారు. సినిమాల్లోకి రావాలని.. యాక్టింగ్‌లో అడుగు పెట్టాలంటూ తాను వారిని ఇబ్బంది పెట్టబోనన్నారు.

తన తల్లిదండ్రులు సైతం తనను అలా పెంచలేదన్నారు. తన తల్లిదండ్రులు తన అభిప్రాయాన్ని గౌరవించిన మాదిరిగానే తాను కూడా తన పిల్లల అభిప్రాయాలను గౌరవించాలనుకుంటున్నట్టు తెలిపారు. తను నటుడినన్న విషయం తన పిల్లలకు తెలుసు కాబట్టి తన బాటలోనే అడుగులు వేయాలనుకుంటే వేస్తారని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.