03-04-2025 12:42:39 AM
వరి కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
మహబూబ్నగర్, ఏప్రిల్ 2 (విజయ క్రాంతి) : మీ మధ్యలోనే ఎల్లప్పుడూ ఉంటూ అందరి సంక్షేమం కోసం పనిచేస్తున్నానని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో, కౌకుంట్ల మండలంలో జిల్లా కలెక్టర్ విజయేందిర తో కలిసి సన్న బియ్యంను లబ్ధిదారులకు అందజేశారు అనంతరం అజ్జకొల్లు గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎవరికి ఏ కష్టం వచ్చినా మీ కుటుంబ సభ్యులుగా అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వము వేసే ప్రతి అడుగు ప్రజా సంక్షేమం కోసమే అనే విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.
ఎవరు వచ్చి ఏదో చెబితే అవి నమ్మకూడదని, వాస్తవ పరిస్థితులను అందుబాటులో ఉంచి ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. సన్న బియ్యంతో పాటు మరో తొమ్మిది రకాల నిత్యఅవసర సరుకులు అందించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.