05-07-2024 01:40:31 AM
చోరీ చేసిన ఇంట్లో లేఖరాసి వెళ్లిన దొంగ
ఎత్తుకెళ్లిన నగదు, బంగారం నెలలో తిరిగిచ్చేస్తాననా హామీ
తమిళనాడు, జూలై 4: తమిళనాడు లోని ఓ ఇంట్లో జరిగిన దొంగతనం ఇ ప్పుడు వైరల్గా మారుతోంది. వివరాల్లోకి వెళ్తే.. తూత్తుకుడి జిల్లాలోని మేఘనాపురం గ్రామంలో రిటైర్డ్ టీచర్ చిత్తరై సెల్విన్ తన భార్యతో కలిసి జూన్ 17న చెన్నైలో ఉం టున్న తన కొడుకుని కలవడానికి వెళ్లాడు. తన ఇంటిని చూసుకునే బాధ్యత స్థానికంగా ఉంటున్న మహళ(సెల్వి)కు అప్పగించి వెళ్లాడు. ఆమె రోజూ ఆ ఇంటిని శుభ్రం చేసి ఉంచేది.
జూన్ 26న ఆమె ఇంటిని శుభ్రం చేసేందుకు రాగా ఆ ఇంటి ప్రధాన తలుపు తెరిచి ఉంది. అనుమానం వచ్చిన ఆమె వెంటనే ఇంటి యజమాని చిత్తరై సెల్విన్కు సమాచారం ఇచ్చింది. వెంటనే చెన్నై నుంచి ఇంటికి చేరుకున్న చిత్తరై సెల్విన్ ఇంటి లోపలికి వెళ్లి చూడగా.. ఇంటిలోని రూ.60వేలు, 12గ్రా బంగారం, వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఇంటిని తనిఖీ చేశారు. ఈ క్రమంలో వారికి ఓ లెటర్ దొరికింది. లెటర్ రాసింది మరెవరో కాదు. చోరీ చేసిన దొంగే. అందులో ఇలా రాసిఉంది. ‘దయచేసి నన్ను క్షమించండి.. మా అమ్మకు అనారోగ్యంగా ఉంది.. నేను మీ సొత్తు, నగదును ఈ నెలాఖరులోపు మీకు తిరిగి చ్చేస్తాను’ అని రాశాడు. దాదాపు ఏడాది క్రితం కేరళ రాష్ట్రంలోని పలక్కాడ్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.