‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలతో అలరించారు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. అప్పట్నుంచి వీరిద్దరూ రిలేషన్లో ఉన్నట్టు ఎంతో కాలం నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. విజయ్, రష్మిక ప్రేమలో ఉన్నారంటూ బాలీవుడ్ నటి అనన్య పాండే సైతం ఓ ఇంటర్వ్యూలో పరోక్షంగా హింట్ ఇవ్వడం వారి ప్రేమాయణం వార్తలకు ఊతమిచ్చింది.
అయితే తాము మంచి స్నేహితులమేనని ఎన్నోసార్లు ఈ జంట స్పష్టం చేసినా వార్తలు మాత్రం ఆగడంలేదు. తాజాగా రష్మిక భాగస్వామి గురించి చెప్పటంతో మరోసారి ఈ జంట టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. విక్కీ కౌశల్ కథానాయకుడిగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ‘ఛావా’ సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. “నీకు సంతోషకరమైన ప్రదేశం ఏది..?’ అని ఎవరైనా అడిగితే వెంటనే ఇల్లు అని చెప్తాను.
ఇంట్లో ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. పాజిటివ్గా అనిపిస్తుంది. ఎక్కడా పొందలేని ఆనందం ఇంట్లో లభిస్తుంది. ఎంతో మంది ప్రేమాభిమానాలు పొందినప్పటికీ నేను ఒక కుమార్తెగా, సోదరిగా, భాగస్వామిగా నా జీవితాన్ని గౌరవిస్తాను.
అది పూర్తిగా నా వ్యక్తిగత జీవితం. మన మనసుకు ప్రతిబింబాలు కళ్లే. కళ్లతో పలికించే హావభావాలను నేను నమ్ముతాను. నవ్వుతూ ఉండే వ్యక్తులను ఇష్టపడతాను. ఎదుటివారిని గౌరవించేవారంటే ఇష్టం” అని చెప్పింది. రష్మిక కథానాయకిగా నటించిన ‘ఛావా’ ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఇదే కాకుండా మరో ఐదు సినిమాల్లోనూ నటిస్తోంది రష్మిక.