calender_icon.png 24 September, 2024 | 2:46 PM

సినిమాల్లోకి రావాలనుకోలేదు

20-09-2024 12:58:22 AM

సౌరభ్ దాస్‌గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కహాన్ షురూ కహాన్ ఖతం’లో తొలిసారి నటిస్తోంది ప్రముఖ సింగర్ ధ్వని భానుషాలి. మ్యూజిక్ ఆల్బమ్స్ రూపొందిస్తూ ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న ఆమెకిది తొలి చిత్రం కావటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వినోద్ భానుషాలి, లక్ష్మణ్ ఉటేకర్, కరిష్మా శర్మ, భనుష్ కమలేశ్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 20న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ధ్వని.. తన గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. “నటన రంగంలోకి రావాలని, క్రాఫ్ట్ నేర్చుకోవాలని ఇంతకు ముందు అనుకునేదాన్ని. అయితే అప్పుడు సినిమాల్లో నటించాలన్న ఆలోచన నాకు ఉండేది కాదు.

మ్యూజిక్ వీడియోస్‌లో నాకు హెల్ప్ అవుతుందని మాత్రమే యాక్టింగ్ నేర్చుకోవాలనుకున్నా. మా నాన్న నా మ్యూజిక్ వీడియోలు చూసి సరిగ్గా తీయడం లేదని చెప్పడంతో యాక్టింగ్ కోచింగ్ తీసుకోవడం మొదలుపెట్టాను. ‘కహాన్ షురూ కహాన్ ఖతం’ షూటింగ్ కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూశాను. అదే సమయంలో కొద్దిగా భయం కూడా ఉండేది. ఎందుకంటే ఇది నా మొదటి చిత్రం. మ్యూజిక్ వీడియోల్లో నేను సాధారణంగా నటించేదాన్ని. మ్యూజిక్ వీడియోలు, చిత్రాలు.. ఈ రెండింటిలో నటించడం నటీనటులకు సవాల్‌తో కూడుకున్న పనే అని తెలుసుకున్నాను. ఆర్టిస్ట్‌గా నేను ఈ రెండింటిలోనూ న్యాయం చేయాలని, ప్రేక్షకులను మెప్పించేలా నటించాలనుకుంటున్నాను. ‘మీరా’ పాత్ర కోసం పనిచేసేటప్పుడు దర్శకుడు సౌరభ్ దాస్‌గుప్తా ఇచ్చిన సలహాలు నా యాక్టింగ్ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లడానికి దోహదం చేస్తాయని నమ్ముతున్నా” అని తెలిపింది.