ఒక్క ఇండియానే కాదు.. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జపాన్, చైనా, కొరియా, యూరప్ వంటి దేశాల్లోనూ రాజమౌళి ఇప్పుడు ఫేమస్. ఇందుకు కారణం ఆయన తెరకెక్కించిన సినిమాలే. అంతటి ఘనత వహించిన వ్యక్తి ప్రయాణం గురించి అందరికీ చెప్పే ప్రయత్నంలో భాగమే నెట్ఫ్లిక్స్ రూపొందించిన ‘మోడరన్ మాస్టర్స్ : ఎస్ఎస్ రాజమౌళి’. ఈ పేరుతో దర్శకుడు రాజమౌళి గురించిన విశేషాల సమాహారమైన డాక్యుమెంటరీ ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, ఫిల్మ్ కంపానియన్ స్టూడియోస్ నిర్మించిన ఈ డాక్యుమెంటరీని సినీ విమర్శకురాలు, పాత్రికేయురాలు అనుపమ చోప్రా హోస్ట్ చేసింది.
ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్ సోమవారం విడుదలైంది. పలువురు ప్రఖ్యాత నటులు, సినీ సంగీత రంగ ప్రముఖులు రాజమౌళి గురించి తమ అభిప్రాయాలను దీంట్లో వెల్లడించారు. టాలీవుడ్తోపాటు హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్, బాలీవుడు దర్శక నిర్మాత కరణ్ జోహార్ కూడా రాజమౌళి గురించి చెప్పిన అభిప్రాయాన్ని ఇందులో చూడొచ్చు. ఈ ట్రైలర్లో ‘నేను నా కథకు బానిసను..’ అంటూ రాజమౌళి చెప్పిన ముగింపు వ్యాక్యం హృదయాలను తాకుతోంది.