న్యూఢిల్లీ, అక్టోబర్ 3: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్కి భారత సబ్సిడరీ అయిన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) అక్టోబర్ 14న ప్రారంభమవుతుందని సంబంధిత వర్గాలు గురువారం వెల్లడించాయి.
ఈ ఐపీవోకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కొద్దిరోజుల క్రితమే ఆమోదం తెలిపింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీవో ద్వారా 3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.25,000 కోట్లు) సమీకరించాలని కొరియా ఆటో దిగ్గజం భావిస్తున్నది. ప్రతిపాదిత మొత్తాన్ని సమీకరిస్తే ఇండియాలో ఇప్పటివరకూ వచ్చిన పబ్లిక్ ఆఫర్లు అన్నింటికంటే హ్యుందాయ్ ఐపీవో అతిపెద్దదిగా నిలుస్తుంది.
రెండేండ్ల క్రితం లైఫ్ ఇన్సూరెన్స్ జారీచేసిన రూ. 21,000 కోట్ల ఇష్యూను మించుతుంది. సెబీకి సమర్పించిన ప్రాస్పెక్టస్ ప్రకారం ప్రమోటింగ్ సంస్థ హ్యుందాయ్ మోటార్ కంపెనీ తన సబ్సిడరీలో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూట్లో 14.22 కోట్ల షేర్లను విక్రయిస్తుంది. ఎటువంటి తాజా ఈక్విటీ షేర్లనూ జారీచేయదు.