06-02-2025 01:13:12 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): నగరంలో పలు ప్రాంతాల్లో రహదారులకు అడ్డంగా నిర్మించిన ప్రహరీలను హైడ్రా అధికారులు బుధవారం కూల్చి మేడ్చల్ జిల్లా కాప్రా మున్సిపాలిటీలో ఎన్ఆర్ఐ కాలనీ వాళ్లు నిర్మించిన ప్రహారీని తొలగించారు. దీంతో నాలుగు కాలనీల్లో రాకపోకలకు ఇబ్బందులు తొలగాయి.
మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని డిఫెన్స్ కాలనీ 218/1 సర్వే నంబరులో ప్రజా అవసరాలకు కోసం కేటాయించిన 1200 గజాల స్థలాన్ని కబ్జా చేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నంటూ స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
దీంతో స్థానిక అధికారులతో కలిసి హైడ్రా అధికారులు పరిశీలించగా, మొత్తం 5 ప్లాట్లుగా చేసి కొన్నింటిని అమ్మినట్టుగా నిర్థారించుకుని కబ్జాను తొలగించి జీహెచ్ఎంసీ ల్యాండ్గా హైడ్రా అధికారులు బోర్డును ఏర్పాటు చేశారు.
శంషాబాద్ మండలం రాళ్లగూడ గ్రామం సమీపంలోని ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డుకు వెళ్లేందుకు దారి లేకుండా అడ్డుగా నిర్మాణం చేసిన ప్రహారీని తొలగించారు. కూకట్పల్లి నిజాంపేట రోడ్డులోని హులిస్టిక్ దవాఖాన వెనుకనున్న ప్రభుత్వ స్థలం చుట్టూ నిర్మించిన ప్రహారీని బుధవారం హైడ్రా తొలగించింది.