calender_icon.png 24 September, 2024 | 9:29 AM

షెడ్లను కూల్చిన హైడ్రా

24-09-2024 03:09:19 AM

కావూరి హిల్స్‌లో బుల్డోజర్ 

శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 23 ( విజయక్రాంతి): హైడ్రా తన దూకుడు కొన సాగిస్తున్నది. ఇప్పటి వరకు చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో వెలిసిన నిర్మాణాలను తొలగించిన హైడ్రా అధికారులు తాజాగా ప్రభుత్వ స్థలాల ఆక్రమ ణలపై కొరడా ఝులిపిస్తున్నారు. శేరిలింగపల్లి మండల పరిధిలోని మాదాపూర్ కావూరి హిల్స్‌లోని పార్క్‌లో సొసైటీ వారు షెడ్‌లను ఏర్పాటుచేసి వాటిని లీజుకు ఇచ్చారు. దీనిపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ కొందరు సొసైటీ సభ్యులు గతంలోనే జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

అయినా ఎలాంటి ప్రయోజనం జరుగలేదు. ఈ మధ్య కాలంలో హైడ్రాకు కూడా వారు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన హైడ్రా అధికారులు సోమవారం ఉదయం జేసీబీలతో ఆ ప్రాంతానికి చేరుకుని పార్క్‌లో వెలిసిన షెడ్లను కూల్చివేశారు. అక్కడ పార్క్ స్థలం అంటూ బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ స్థలాల కబ్జాలకు పాల్పడితే ఉపేక్షించబోమని హైడ్రా అధికారులు హెచ్చరించారు.