20-04-2025 12:57:10 AM
రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి విముక్తి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (విజయక్రాంతి)/అబ్దుల్లాపూర్మెట్: నగరంలో హైడ్రా శనివారం కూల్చివేతలు చేపట్టింది. హైడ్రా అధికారులు తొలగించారు. హఫీజ్పేట్లోని సర్వే నంబర్ 79లో మొత్తం 39.2 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా ఇప్పటికే ఆ భూమి సగానికి పైగా ఆక్రమణకు గురైంది.
వసంత హోమ్స్ అనే సంస్థ చుట్టూ ప్రహరీ నిర్మించి ఆక్రమణలకు పాల్పడ్డట్లు అధికారులు తెలిపారు. 39.2ఎకరాల భూ మిలో 19 ఎకరాలను కాజేసి ఇళ్లు నిర్మించి, సదరు సంస్థ అమ్మేసింది. ఖాళీగా ఉన్న మిగతా భూమిలో వసంత హోమ్స్ సంస్థ కార్యాలయంతో పాటు, పలు షెడ్లు నిర్మించుకుని వివిధ సంస్థలకు అద్దెకు ఇచ్చింది. వాటిని అధికారులు కూల్చివేశారు. షేక్పేట మండలం రాయదుర్గం దర్గా సమీపంలోని సర్వే నెంబర్ 5/2లో 39 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు జరుగుతున్నట్టు హైడ్రా అధికారులు నిర్ధారించారు.
అక్కడ ఉన్న చెరువును కూడా నార్నే ఎస్టేట్స్ సంస్థ కబ్జా చేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నారని గుర్తించారు. ఆ ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. హఫీజ్పేట్, రాయదుర్గం ప్రాంతాల్లో తొలగించిన ఆక్రమణల వద్ద అవి ప్రభుత్వ భూములు అని పేర్కొంటూ అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములకు కబ్జాల నుంచి విముక్తి లభించింది. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ ఇంజాపూర్లో 7 కాలనీలకు వెళ్లే 45 అడుగుల విస్తీర్ణంలో ఉన్న రోడ్డును కబ్జా చేసి స్కూప్స్ ఐస్క్రీమ్ కంపెనీ యాజమాన్యం అక్రమ నిర్మాణాలు చేపట్టిం ది. హైడ్రా ఆ నిర్మాణం కూల్చివేసింది.