- జాబితాలో చివరన ములుగు జిల్లా
- రాష్ట్రవ్యాప్తంగా 9,21,883 ఎంఎస్ఎంఈలు
- అందులో 8,92,147లు సూక్ష్మతరహావే
- మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు 1,90,669
- సర్వీస్ సంస్థలు 7,31,214
- సోషియో ఎకానమిక్ అవుట్లుక్ వెల్లడి
హైదరాబాద్, జూలై 25 (విజయక్రాంతి): అత్యధిక సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు(ఎంఎస్ఎంఈ) ఉన్న జిల్లాగా హైదరాబాద్ ఘనత సాధించింది. ఈ విషయాన్ని సోషియో ఎకానమిక్ అవుట్లుక్(ఎస్ఈఓ) నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 9,21,883 ఎంఎస్ఎంఈలు ఉండగా అందులో 1,90,669 ఎంఎస్ఎంఈలు మ్యానుఫ్యాక్చరింగ్కు చెందినవి. 7,31,214 సర్వీస్కు సంబంధించిన సంస్థలున్నాయి. మొత్తం ఎంఎస్ఎంఈల్లో 8,92,147 సూక్ష్మ తరహా సంస్థలు, 26,708 చిన్న తరహా సంస్థలు, 3,028 మధ్య తరహా సంస్థలున్నాయి. కేవలం హైదరాబాద్లోనే 1,68,077 ఎంఎస్ఎంఈలు ఉండగా అందులో 34,140 మ్యానుఫ్యాక్చరింగ్, 1,33,937 సర్వీస్ సంస్థలున్నాయి.
వీటిలో 1,56,642 సూక్ష్మతరహా సంస్థలున్నాయి. 9,813 చిన్న తరహా సంస్థలు, 1,622 మధ్య తరహా సంస్థలున్నట్టు సోషియో ఎకానమిక్ అవుట్లుక్ నివేదికలో పేర్కొంది. ఈ జాబితాలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలువగా 1,09,164 ఎంఎస్ఎంఈలతో రంగారెడ్డి రెండో స్థానంలో నిలిచింది. వీటిలో 21,788 మ్యానుఫాక్చరింగ్, 87,376 సర్వీస్ ఎంఎస్ఎంఈలు కాగా 1,04,846 మైక్రో, 3,866 స్మాల్, 452 మధ్యతరహా సంస్థలున్నాయి. 92,235 ఎంఎస్ఎంఈలతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడో స్థానంలో నిలిచింది.
ఇందులో 28,361 మ్యానుఫ్యాక్చరింగ్, 63,874 సర్వీస్ సంస్థలు, 88,037 సూక్ష్మ, 3,821 చిన్నతరహా, 377 మధ్య తరహా సంస్థలున్నాయి. 3,211 ఎంఎస్ఎంఈలతో ములుగు జిల్లా చివరి స్థానంలో నిలిచిందని ఎస్ఈవో వెల్లడించింది. వీటిలో 590 మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు కాగా 2,621 సర్వీస్ సంస్థలున్నాయి. ములుగులోని మొత్తం ఎంఎస్ఎంఈల్లో 3,167 సూక్ష్మ, 44 చిన్న తరహా సంస్థలున్నాయి. మధ్య తరహా సంస్థలు లేవని ఎస్ఈవో నివేదిక స్పష్టం చేసింది.