calender_icon.png 20 October, 2024 | 5:08 AM

హైదరాబాద్ దక్షిణాన గోల్ఫ్ సిటీ

20-10-2024 01:37:01 AM

  1. ఏర్పాటుతో పదివేల మందికి ఉపాధి
  2. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయ క్రాంతి): ప్రొఫెషనల్ గోల్ఫర్స్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా(పీజీఏ) స్థానిక భాగస్వామి స్టోన్ క్రాఫ్ట్‌తో కలిసి సిటీ దక్షిణాన విస్తారమైన గోల్ఫ్ సిటీని నిర్మించేందుకు ముందుకు వచ్చిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు.

అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో ప్రధాన కేంద్రంగా ఉన్న పీజీఏ ప్రతినిధి బృందం శనివారం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం తమకు సహకరిస్తే గోల్ఫ్ కోర్టులు, నివాస సముదాయాలు, హోటళ్లు, వినోద పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి పీజీఏ, స్టోన్ క్రాఫ్ట్ సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయని వెల్లడించారు.

పీజీఏ ప్రస్తుతం ముంబైలో షాపూర్జీ పల్లోంజీ సంస్థతో కలిసి గోల్ఫ్ సిటీని నిర్మిస్తోందని తెలిపారు. ఇక్కడ స్టోన్‌క్రాఫ్ట్ భాగస్వామ్యంతో భారీ పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించిందని వివరించారు. గోల్ఫ్‌సిటీ నిర్మాణం పూర్తయితే వచ్చే పదేళ్లలో పదివేల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మానస పుత్రిక ఫోర్త్ సిటీలో ఎలాంటి కాలుష్యం వెలువడని నెట్ జీరో సిటీని నిర్మింస్తుందని తెలిపారు.

నిర్మాణాలకు మూడింతలు ప్రకృతి వనాలను పెంచడం ద్వారా ఆహ్లాదకర నివాస ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సంస్థలు తమ ప్రజెంటేషన్‌లో వెల్లడించినట్టు చెప్పారు. పీజీఏ కన్సార్టియం దాదాపు 200 ఎకరాల్లో ‘18 హోల్’ ప్రామాణిక గోల్ఫ్ కోర్సును ఏర్పాటు చేస్తుందని, ఇది వినియోగంలోకి వస్తే దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిది అవుతుందని వెల్లడించారు.

మియావాకి పద్ధతిలో అడవిని పెంచడం ద్వారా సహజసిద్ధమైన డెక్కన్ శిలలకు, స్థానిక నీటి వనరులకు ఒక అలంకారప్రాయమవుతుందని వివరించారు.

పీజీఏ ప్రపంచంలోని అతిపెద్ద క్రీడా సంస్థల్లో ఒకటి  కావడంతోపాటు 30 వేల మందికి పైగా గోల్ఫ్ నిపుణులతో కూడిన ఈ సంస్థ గోల్ఫ్ అభివృద్ధికి వందేళ్లుగా కృషి చేస్తోంది. సమావేశంలో స్టోన్‌క్రాఫ్ట్ సీఈవో కీర్తి చిలుకూరి, అలోక్ తివారి, పీజీఏ ప్రతినిధులు టిమ్ లాబ్, అలెక్స్, హే, డేవిడ్ బ్లమ్, కెన్ సాగర్, రాధా కిశోర్ పాల్గొన్నారు.