calender_icon.png 8 October, 2024 | 12:09 PM

సార్ నా భార్యను హత్య చేశాను

08-10-2024 09:45:27 AM

నిద్రిస్తున్న భార్యను సుత్తితో కొట్టి చంపాడు

హైదర్ షాకోట్ లో దారుణం

కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య

అనంతరం పిల్లలతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన నిందితుడు

రాజేంద్రనగర్,(విజయక్రాంతి): కలకాలం తోడునీడగా ఉంటానని, కష్టాల్లో ఒకటిగా ముందుకు సాగుదామని పెళ్లినాట బాస చేసిన అతడు కర్కోటకుడిగా మారాడు. క్రూరుడిగా మారి నిద్రిస్తున్న భార్య తలపై సుత్తితో మోది అత్యంత కిరాతకంగా చంపేసిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ లో జరిగింది. స్థానికులు, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కృష్ణవేణి(32), శ్రీనివాస్ దంపతులు హైదర్ షాకోట్ లోని మాధవి నగర్ లో నివాసం ఉంటున్నారు.

వీరికి ఓ కొడుకు,  కుమార్తె ఉన్నారు. శ్రీనివాస్ స్థానికంగా టెంట్ హౌస్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొంతకాలంగా అతడు భార్యను వేధించసాగాడు. ఈ విషయమై ఆమె పలుమార్లు నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు సరిగా స్పందించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ సోమవారం అర్ధరాత్రి నిద్రిస్తున్న తన భార్య కృష్ణవేణి తలపై సుత్తితో మోది హత్య చేశాడు.

అనంతరం అతడు పిల్లలను నిద్రలో నుంచి లేపి నేరుగా నార్సింగి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన శ్రీనివాస్ సార్ నా భార్యను హత్య చేశాను అంటూ పోలీసులకు చెప్పడంతో ఒక్కసారిగా హతాసులయ్యారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నార్సింగి పోలీసులు పేర్కొన్నారు.