01-03-2025 08:01:34 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో నడిరోడ్డుపై ఓ భర్త భార్య గొంతు కోసి హత్య చేసి తాను కడుపులో పొడుచుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఆర్బీ నగర్ కు చెందిన నర్సింలు, మహేశ్వరి భార్యాభర్తలు. నర్సింలు చౌరస్తాలో గల సులబ్ కాంప్లెక్స్ లో పనిచేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య తరచూ డబ్బుల గురించి వివాదం నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. డబ్బులు విషయమై నరసింహులు శనివారం చౌరస్తా వద్ద మహేశ్వరితో గొడవపడ్డాడు అనంతరం వెంట తెచ్చుకున్న చాకుతో మహేశ్వరి గొంతు కోశాడు. ఆపై తాను కడుపులో పొడుచుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు వెంటనే నర్సింలును స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ తీసుకెళ్లారు. ఏ ఎస్పీ చైతన్య రెడ్డి , సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కుటుంబ కలహాలతో హత్య చేసినట్లుగా ప్రాథమిక విచారణలో తెలిసిందని సీఐ తెలిపారు.