calender_icon.png 24 October, 2024 | 12:01 AM

భర్త మరణం.. కొడుకు జననం

23-10-2024 09:51:18 PM

అలంపూర్,(విజయక్రాంతి): పుట్టబోయే బిడ్డపై ఆ దంపతులు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఇక జీవితం ఆనందంగా సాగిపోతుందని కలలుగన్నారు. అంతలోనే విధి ఆడిన వింత నాటకంలో బలయ్యారు. ఈ విషాదకర సంఘటన గద్వాల జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే... రాజోలి మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన కురువ శివ(28), గత ఏడాది క్రితం ఏపీలోని బేతంచెర్ల పట్టణానికి చెందిన లక్ష్మితో వివాహమయ్యింది. శివ తన కుటుంబ పోషణ కోసం పెట్రోలు బంకులో పనిచేస్తున్నాడు. అతని భార్య లక్ష్మి నిండు గర్భిణిగా ఉండడంతో కాన్పు నిమిత్తం తమ స్వగృహంకి వెళ్ళింది. ఈ క్రమంలో మంగళవారం లక్ష్మీకి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ప్రసవం నిమిత్తం కర్నూల్  ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అదే రోజు రాత్రి తన భర్త శివ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రాజోలి సమీపంలో బైక్ అదుపు కింద పడ్డాడు.

ఈ ప్రమాదంలో శివ తలకు బలమైన గాయాలు అయ్యాయి. అది గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ఒంటి గంటలకు మృతి చెందాడు. మరోవైపు శివ భార్య రెండు గంటల సమయంలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. భర్త చనిపోయిన విషయాన్ని లక్ష్మికి చెబితే ఏమవుతుందోనని కుటుంబ సభ్యులు ఆమెకు చెప్పలేదు. శివ మృతదేహాన్ని రాజోలికి తరలించి ఆమెకు తెలియకుండానే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కొడుకు పుట్టాడు అన్న ఆనందంలో తల్లి ఉండగా.. భర్త మరణించడన్న వార్త చెప్పకుండా కుటుంబ సభ్యులు తమలో తాము కుమిలిపోతున్నారు. మృతుడు తండ్రి పెద్ద మద్దిలేటి ఫిర్యాదు మేరకు జగదీష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.