24-02-2025 03:38:14 PM
ప్రతాపవాడలో కలకలం రేపిన ఘటన
కత్తులతో బెదిరించి
80 తులాల బంగారం, రూ. 7లక్షల నగదు అపహరణ
డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం తో పోలీసుల దర్యాప్తు
హుజురాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని ప్రతాపవాడలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రతాప రాఘవరెడ్డి ఇంట్లో చొరబడి కత్తులతో బెదిరించి సుమారు 80 తులాల బంగారం, రూ.7 లక్షల నగదు అపహరించికెళ్ళిన ఘటన కలకలం రేపింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలను ఇలా ఉన్నాయి... పట్టణంలోని ప్రతాపవాడకు చెందిన ప్రతాప రాఘవరెడ్డి ఇంట్లో ఆదివారం రాత్రి సుమారు 11:30 గంటల ప్రాంతంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. ఇంట్లో ఉన్న రాఘవరెడ్డి, అతని భార్య వినోదపై కత్తులతో దాడి చేశారు.
కూతురి మెడపై కత్తులు పెట్టి బెదిరించి ఇంట్లోని బీరువాలో ఉన్న 80తులాల బంగారు ఆభరణాలు, రూ.7 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫోన్లను తీసుకెళ్లి బయటపడేశారు. విషయం తెలుసుకొని వచ్చిన రాఘవరెడ్డి కుటుంబ సభ్యులు వచ్చి గాయపడ్డ ఇద్దరిని చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సీఐ తిరుమల్ గౌడ్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. వేలి ముద్రల నిపుణులు, డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
అదే ఇంటి పైన ఉండే అతని కొడుకు కోడలు ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించగా పైన ఎవరూ లేరు అంతలా అయితే వెళ్లి చూడండి అనే సరికి దొంగలు పైకి వెళ్లలేదని బాధితుడు రాఘవరెడ్డి తెలిపారు. దొంగలు వెళ్లిన వెంటనే మా కుమారులకు ఫోన్ చెయ్యగా 100 డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. సుమారు గంటపాటు దొంగలు ఇంట్లో ఉండి నానా బీభత్సం సృష్టించి పెద్ద ఎత్తున బంగారం నగదు ఎత్తుకొని వెళ్లడమే కాక ముగ్గురిపై కత్తులతో దాడి చేసి గాయపరచడం పట్టణంలో సంచలనంగా మారింది.
అయితే రాఘవరెడ్డి కూతురు గత ఐదు రోజుల క్రితమే అమెరికా నుండి పుట్టింటికి రాగా ఆమె ఒంటిపై ఉన్న బంగారం, ఆమె వెంట తెచ్చుకున్న నగదును గుర్తించిన తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడి ఉండి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. దొంగలు ఇంటి వెనక నుండి ఇంట్లోకి చొరబడి నీళ్ల మోటర్ ను ఆన్ చేసి చుట్టుపక్కల నల్లాలు విప్పి పడుకున్న వారికి మెలుకువచ్చే విధంగా చేసి తలుపు తీసి చూసే క్రమంలో ఇంట్లోకి చొచ్చుకొని లోపలికి వెళ్లి ఈ చోరికి పాల్పడడం చూస్తుంటే ఇదంతా ఒక పథకం ప్రకారం చేసినట్లుగా నిపుణులు భావిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ ఇంటి ముందు నుండి నేరుగా రంగనాయకుల గుట్ట వైపు వెళ్లడం గమనిస్తే దొంగ పథకం ప్రకారమే దొంగతనం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.