27-04-2025 12:18:09 AM
500 మందికిపైగా గాయాలు
టెహరాన్, ఏప్రిల్ 26: దక్షిణ ఇరాన్ బందర్ అబ్బాస్ నగరంలోగల షాహిద్ రాజేయి పోర్టులో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 500మందికిపైగా గాయపడగా నలుగురు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. పేలుడు సంభవించిన వెంటనే నాలుగు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
పోర్టులోని ఓ కంటెయినర్లో పేలుడు సంభవించినట్టు తెలిపిన ఇరాన్ అధికారులు.. అందుకు సంబంధించిన నిర్ది ష్ట కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. ఒమన్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య మూడో రౌండ్ అణు చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
ఈ పేలుడు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్కు సంబంధించిన నావికా స్థావర సమీపంలో సంభవించినట్టు స్థానిక మీడియా పేర్కొంది. అయితే దీనితో తమకు ఎటువంటి సంబంధం లేదని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ స్పష్టం చేసింది.