అధ్వానంగా మారిన చేగుంటగజ్వేల్ రహదారి
ప్రమాదాలకు గురవుతున్నా పట్టించుకోని అధికారులు
చేగుంట, జూలై 28 : చేగుంట నుంచి గజ్వేల్ వెళ్ళే ప్రధాన రహదారి పరిస్థితి అధ్వాన్నంగా మారింది. గుంతలు పడ్డ ఈ రహదారిపై ప్రయాణం నిత్య నరకంగా తయారైంది. తద్వారా, నిత్యం వందలాది మంది ప్రయాణించే ఈ రహదారిపై వాహనదారులు అదుపుతప్పి పడిపోయి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బీటీ రోడ్డు మొత్తం కొట్టుకుపోయి పెద్దపెద్ద గుంతలుగా మారి ప్రయాణం చేయాలంటే భయమేస్తుందని పలువురు వాహనదారులు వాపోతున్నారు. గతంలో ఈ రహదారి గుండా ప్రయాణిస్తూ అనేక మంది ప్రమాదాలకు గురయ్యారని గుర్తు చేస్తున్నారు. రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని పలుమార్లు అధికారులకు, పాలకులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. గుంతలమయంగా మారిన రోడ్డుపై నీరు నిల్వ ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే స్పందించి రోడ్డును బాగు చేయాలని కోరుతున్నారు.