13-02-2025 12:25:37 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలు, హాస్టళ్లలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణలపై తెలంగాణ విద్యాకమిషన్ ఇప్పటికే ప్రభుత్వానికి వేర్వేరుగా నివేదికలు అందజేసింది. కమిషన్ సిఫార్సుల అమలు సాధ్యసాధ్యాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎలా చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
పిల్లలకందించే మధ్యాహ్న భోజనంలో చేపట్టాల్సిన సంస్కరణలను ప్రభుత్వం 2025 విద్యాసంవత్సరం నుంచి లేదా వీలైతే ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఫీజుల నియంత్రణ చట్టం అమలుకు మాత్రం శాసనసభ ఆమోదం తప్పనిసరి. త్వరలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెడతారా? లేదా మరోసారి ప్రత్యేకంగా సభను ఏర్పాటు చేస్తారా అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది.
ఇంతకంటే ముందు క్యాబినెట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. విద్యా కమిషన్ అందజేసిన ఈ రెండు నివేదికలపై కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం అటు ప్రైవేట్ స్కూళ్లు నష్టపోకుండా, ఇటు తల్లిదండ్రులపై భారం పడకుండా చట్టాన్ని రూపొందించాలని సమాలోచనలు చేస్తోం ది. ఇదిలా ఉండగా ప్రభుత్వ స్కూళ్లపై మరో సమగ్ర నివేదిక అందజేయాలని తెలంగాణ విద్యాకమిషన్ ప్రభుత్వానికి అందించనున్నట్టు సమాచారం.
మధ్యాహ్న భోజనంపై కమిషన్ సిఫార్సులు
* టాయిలెట్స్ సహా కిచెన్, డైనింగ్హాల్స్ శుభ్రంగా ఉంచాలి.
* సరుకుల స్టోరేజీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వెంటిలేషన్తో పాటు ఫ్యాన్లు ఏర్పాటు చేయాలి.
* సన్నబియ్యం, తాజా కూరగాయలు, పండ్లు, చికెన్, మటన్ పోషకాలతో కూడిన ఆహారం అందించాలి
* 1 6- 9, 10 తరగతుల్లోని విద్యార్థులకు వేర్వేరు పరిమాణంలో భోజనాల అందజేత.
* సెంట్రలైజ్డ్ టెండర్ల సరకుల సరఫరా.
* రవ్వ, బియ్యం, పప్పులు, నూనె, వంట సామాగ్రిని తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఈఐబ్యూడీసీ) ద్వారా సరఫరా చేయాలి.
* పాములు, విష పురుగులు తిరగకుండా ప్రహరీగోడల నిర్మాణం.
* 500 మంది విద్యార్థులకు వెయ్యి చదరపు ఫీట్ల విస్తీర్ణంలో డైనింగ్ హాల్ నిర్మాణం. విద్యార్థులకు సరిపడా ఫర్నీచర్ అందుబాటులో ఉంచాలి.
* నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్)తో ఫుడ్ శాంపిల్ పరీక్షలు, నీటి నాణ్యత పరీక్షల నిర్వహణ.
ఫీజుల -చట్టం కార్యరూపం దాల్చేనా?
ప్రైవేట్ స్కూళ్ల అడ్డగోలు ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలనే డిమాండ్ ఎప్పటి నుం చో ఉంది. గత ప్రభుత్వం దీనిపై క్యాబినెట్ సబ్కమిటీలు వేసి, నివేదికలు కూడా తెప్పించుకుంది. అయినా చట్టరూపం దాల్చలేదు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై ఫోకస్ పెట్టడంతో విద్యాకమిషన్ ఓ నివేదికను రూపొందించి ప్రభు త్వానికి అందజేసింది. ఇప్పటికే 2025 26కు సంబంధించి కొన్ని కార్పొరేట్ స్కూళ్లు అడ్మిషన్లు ప్రారంభించాయి. ఈక్రమంలో త్వరగా చట్టాన్ని తీసుకురావాలని విద్యాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.