calender_icon.png 18 October, 2024 | 2:51 PM

హైదరాబాద్‌కు కేంద్రం ఎన్ని నిధులు ఇస్తుందో చెప్పాలి..?

27-07-2024 10:34:49 AM

హైదరాబాద్: హైదరాబాద్ కు కేంద్రం ఎన్ని నిధులు ఇస్తుందో చెప్పాలి? అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. హైడ్రా, మూసీనది కోసం నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కిషన్ రెడ్డి హైదరాబాద్ కు అభివృద్ధికి నిధులు తీసుకురాలేదని ఆరోపించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. అఖిలపక్షం సమావేశం పెట్టి.. ప్రధాని వద్దకు తీసుకెళ్లాలన్నారు. తెలంగాణకు కేంద్రం సాయం చేసే అవకాశం ఉన్నా.. చేయట్లేదని మంత్రి పొన్నం మండిపడ్డారు. కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు అడగడానికి తమకు ఎలాంటి భేషజాలు లేవని మంత్రి వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రభుత్వం న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల చిత్తశుద్ధితో ఉందన్నారు. బీసీలకు ఎదైనా తప్పు జరిగితే బాధ్యత వహించేందుకు సిద్ధంగా ఉన్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.