ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణికి వరంగల్లోని ఎస్ఆర్ విశ్వవిద్యాలయం గురువారం గౌరవ డాక్టరేట్ను ప్రకటించింది. రంగస్థలం నుంచి రచయితగా సినీ పరిశ్రమలో ప్రవేశించిన భరణి, సుమారు నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎనిమిది వందల పైచిలుకు చిత్రాల్లో నటించారు. రచయితగా 52 సినిమాలకు పనిచేసిన ఆయన, ‘మిథునం’తో దర్శకుడిగానూ మెప్పించారు. గతంలో సినీ గేయ రచయిత చంద్రబోస్కు ఈ పురస్కారం అందించిన ఎస్ఆర్ విశ్వవిద్యాలయం, ఆగస్టు 3న జరుగనున్న స్నాతకోత్సవంలో తనికెళ్ల భరణికి గౌరవ డాక్టరేట్ను అందజేయనుంది.