22-04-2025 12:42:07 AM
సాయుధ కార్యాలయాన్ని పరిశీలించిన ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): సాయుధ పోలీసు సిబ్బందికి క్రమశిక్షణ తో పాటు నిజాయితీ తప్పనిసరిగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. స్థానిక పోలీసు సాయుధ ముఖ్య కార్యాలయాన్ని సోమవారం పరిశీలించిన జిల్లా ఎస్పీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అదే విధంగా పోలీస్ హెడ్ క్వార్టర్లో ఉన్న మోటార్ వెహికల్ అధికారి కార్యాలయాన్ని, పోలీసులు వినియోగిస్తున్న వాహనాలను, వాటి రికార్డులను పరిశీలించారు. పోలీస్ హెడ్క్వార్టర్స్లోని స్టోర్స్ విభాగాన్ని పరిశీలించారు.
తదుపరి హోంగార్డ్ కార్యాలయాన్ని పరిశీలించి హోంగార్డు సిబ్బంది చేస్తున్న విధులపై పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ విధులను నిర్లక్ష్యాన్ని వహించకూడదని తెలిపారు. సిబ్బంది కేటాయించిన విధులను సమయపాలన పాటిస్తూ సక్రమంగా నిర్వహించా లన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విధులకు అనవసరంగా గైర్హాజరైన వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
యువ పోలీసులకు సాంకేతికపరమైన విధులను కేటాయించడం జరుగుతుందన్నారు. జిల్లా లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తినప్పుడు సాయుధ పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తమై ఉండాలని సూచించారు. సిబ్బంది వారికి ఉన్నటువంటి సెలవు దినాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వెంకటి, మురళి, చంద్రశేఖర్, శ్రీపాల్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ రాకేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.