హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 12 (విజయక్రాంతి): హిరాయామా వ్యాధితో బాధ పడుతున్న రోగికి టీఎక్స్ హాస్పిటల్లో విజయవంతంగా సర్జరీ నిర్వహించారు. టీఎక్స్ హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ గజ్జాల నరేష్కుమార్ నేతృత్వంలో అనస్తటిస్ట్ డాక్టర్ సందీప్కుమార్, నిర్వహణ బృందం డాక్టర్ కీర్తికర్రెడ్డి, డాక్టర్ దీపక్రాజు, రవీంద్రరెడ్డి సహకారంతో సర్జరీ విజయవంతంగా నిర్వహించారు. మొదటిసారి ఈ అరుదైన న్యూ రాలాజికల్ చికిత్స విధానాన్ని 1959లో కనుగొనబడిందని, ఇలాంటి అరుదైన చికిత్స విజయవంతం కావడం ఓ మైలు రాయి లాంటిదని వైద్యులు పేర్కొన్నారు. ఇకపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోగులకు కొత్త ఆశను అందిస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ నరేష్కుమార్ మాట్లాడుతూ.. హిరాయామా వ్యాధి చేతులు, మణికట్టు కండరాల బలహీనతను కలిగిస్తుందన్నారు. ప్రధానంగా 20 ఏళ్ల వయస్సు ఉన్న పురుషులను ప్రభావితం చేస్తుందని, ఈ వ్యాధి ఎక్కువగా ఆసియా దేశాల్లో కనిపిస్తుందన్నారు. టీఎక్స్ హాస్పిటల్స్ వ్యాధి యొక్క మూల కారణాన్ని పరిష్కరించడం ద్వారా భవిష్యత్తులో మరింత సమర్థవంతమైన చికిత్సలను అందించడానికి మార్గం సులభం చేసిందని, HD రోగుల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు.