30-03-2025 03:46:00 PM
రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా అత్యధికంగా మణికొండలో ఆస్తి పన్ను
అల్కాపురి కాలనీలో తీవ్ర నీటి ఎద్దడి
గ్రేటర్ ఆల్కాపూర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజేంద్రనగర్,(విజయక్రాంతి): మణికొండ మున్సిపల్ పరిధిలోని ఆల్కాపూర్ కాలనీలో సమస్యల పరిష్కారం కోసమే 'గర్వ' (గ్రేటర్ ఆల్కాపూర్ వెల్ఫేర్ అసోసియేషన్) ఏర్పాటు చేశామని అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా మణికొండ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆస్తి పన్నులు అత్యధికంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆల్కపూర్ కాలనీలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉందని, సమస్యల పరిష్కారం కోసం జలమండలి ఎండి అశోక్ రెడ్డిని కలుస్తామని తెలియజేశారు.
గర్వను నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలిపారు. ఆదివారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆల్కపూర్ కాలనీలో మొదటిసారిగా అసోసియేషన్ సభ్యులు సమావేశమై మాట్లాడారు. గతంలో ఆల్కాపూర్ లో ఎన్నో అసోసియేషన్ లో ఉన్నాయని తెలిపారు. అవి పూర్తిస్థాయిలో సమస్యల పరిష్కారానికి సమయం వెచ్చించడం లేదని పేర్కొన్నారు. కమ్యూనిటీ వెల్ఫేర్ కోసం కృషి చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే ఎంతోమంది ఆల్కాపూర్ నుంచి తమ అసోసియేషన్ లో చేరినట్లు తెలియజేశారు. ఇక్కడి ప్రజలు దోమలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక చిన్న చెరువులో గుర్రపుడెక్క బాగా పెరిగిందని, అధికారులు వెంటనే దానిని తొలగిస్తే దోమల బెడద తప్పుతుందన్నారు. ఇక్కడ ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రంగా పెరిగిందని సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రాజకీయ ప్రమేయం లేకుండా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా గర్వ అసోసియేషన్ సభ్యులు ప్రకటించారు. అల్కాపూర్ కాలనీలో భూకబ్జాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం గర్వ జనరల్ సెక్రెటరీ వినయ్ కుమార్ తణుకురి మాట్లాడుతూ.. 15, 20 ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నామని ఎన్నో సమస్యలను గుర్తించామని వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలో వెబ్సైటు ప్రారంభిస్తామని ప్రజలు తమ సమస్యలను అందులో ప్రస్తావిస్తే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కామన్ మెన్ కు ప్రభుత్వానికి మధ్య వారధిల పని చేస్తామని తెలిపారు. డ్రైనేజీ సమస్యను కూడా పరిష్కరించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో గర్వ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్లు నివరతి సురేష్, ఎంఆర్ఎన్ దిలీప్, కిరణ్ కుమార్, పురుషోత్తం రావు, శ్రీధర్, శ్రావణ్ కుమార్, చిరాన్ జిత్ గోష్ తదితరులు పాల్గొన్నారు.