16-04-2025 07:57:39 PM
మూసాపేట నుంచి కోకాపేటలోని రాజ్ తరుణ్ ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు రాజేశ్వరి, బసవరాజు
కొంతకాలంగా అదే ఇంట్లో ఉంటున్న లావణ్య
తనను ఇంట్లో నుంచి గెంటేశారని సినీ నటుడి మాజీ ప్రేయసి ఆరోపణ
దాడి చేశారని డయల్ 100 కు ఫిర్యాదు..
రాజేంద్రనగర్: మరోసారి సినీ నటుడు రాజ్ తరుణ్(Actor Raj Tarun), అతడి మాజీ ప్రేయసి లావణ్య వ్యవహారం తెరపైకి వచ్చింది. బుధవారం గండిపేట మండల పరిధిలోని కోకాపేటలోని ఉన్న బోల్వాడ్స్ విల్లాస్ లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. బోల్ వర్డ్స్ గేటెడ్ కమ్యూనిటీలో సినీ నటుడు రాజ్ తరుణ్ విల్లా ఉంది. ఇందులో చాలా కాలంగా అతడి మాజీ ప్రేయసి లావణ్య ఉంటుంది. ఇదిలా ఉండగా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు రాజేశ్వరి, బసవరాజు దంపతులు నగరంలోని మూసాపేట ప్రాంతం నుంచి అక్కడికి వచ్చారు. ఇల్లు తమ కుమారుడిది అని, తాము ఇక్కడే ఉంటామని తెలిపారు. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కొంతమందితో వచ్చి ఇంట్లో నుంచి తనను గెంటేశారని లావణ్య ఆరోపించారు.
ఇంట్లోని వస్తువులను, సిసి కెమెరాలను ధ్వంసం చేశారని ఆరోపించింది. తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇప్పటివరకు కిరాయి ఇంటిలో ఉంటున్న తాము సొంత ఇంటికి రావాలన్న ఉద్దేశంతో వచ్చామని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తెలియజేశారు. తమకు పనిచేయాలని ఉద్దేశం ఏమాత్రం లేదని పేర్కొన్నారు. అప్పటికే ఆ ఇంటిలో లావణ్య ఉంటుందనే విషయం తమకు తెలుసని, అయినా ఇల్లు విశాలంగా ఉన్నందున తాము అదే ఇంటిలో వేరొక గదిలో ఉండాలని వచ్చినట్లు పేర్కొన్నారు.
- కేసు కోర్టులో ఉంది: లావణ్య
ఇంటికి సంబంధించిన కేసు కోర్టులో ఉందని, తనపై రాజ్ తరుణ్ తల్లిదండ్రులు దౌర్జన్యం చేశారని ఈ సందర్భంగా లావణ్య తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో తానే రాజ్ తరుణ్ తో కలిసి ఉందామని చెప్పానని, కలిసి ఉండడానికి వచ్చినట్లయితే తానెందుకు అడ్డుకుంటానని లావణ్య ప్రశ్నించారు. అయితే రాజ్ తరుణ్ తల్లిదండ్రులు రాజేశ్వరి, బసవరాజులు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా లావణ్య అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అందరూ తాను నివాసం ఉంటున్న ఇంటి పై దాడి చేశారని ఆరోపిస్తూ లావణ్య డయల్ హండ్రెడ్ కు కాల్ చేయడంతో నార్సింగి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. సినీ నటుడు రాజ్ తరుణ్ తల్లిదండ్రులతో వచ్చిన కొందరిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఇంటిముందు ఆందోళనకు దిగారు.