calender_icon.png 19 October, 2024 | 6:19 AM

హోటల్ జప్తును సస్పెండ్ చేసిన హైకోర్టు

19-10-2024 01:48:23 AM

హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): సికింద్రాబాద్‌లోని హోటల్ మెట్రో పొలిస్‌ను జప్తు చేయడాన్ని శుక్రవారం హైకోర్టు సస్పెండ్ చేసింది. అబ్దుల్ రషీద్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారణ తర్వాత జస్టిస్ బీ విజయసేన్‌రెడ్డి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ హోటల్లో ఒక ఆలయంలో దేవుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులు బస చేశారంటూ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని పిటిషనర్ లాయర్ వాదించారు.

శాంతిభద్రతల సమస్య ఉందంటూ హోటల్ ప్రాంగణాన్ని స్వాధీనం చేసుకోవటం అన్యాయమని వాదించారు. హోటల్లోని కాన్ఫరెన్స్ హాల్‌లో వ్యక్తిత్వ వికాస కోర్సును నిర్వహించడానికి 50 గదులు కేటాయించారని, అందుకోసం వచ్చిన మునవర్ జమా ప్రాంగణం నుంచి బయటకు వెళ్లడానికి మధ్య ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. వాదనల తర్వాత హైకోర్టు పోలీసుల చర్యను సస్పెండ్ చేసింది.