calender_icon.png 2 October, 2024 | 8:04 AM

హైడ్రాపై స్టేకు హైకోర్టు నిరాకరణ

02-10-2024 02:46:21 AM

ప్రభుత్వ వాదన వినకుండా ఉత్తర్వులు ఇవ్వం

ఈ నెల 15కు విచారణ వాయిదా: హైకోర్టు

హైదరాబాద్ అక్టోబర్ 1 (విజయక్రాంతి): హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోపై ఎలాంటి వాదనలు వినకుండా స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు తేల్చిచెప్పింది.

తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేస్తూ, ఆలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం అలియాపూర్‌లోని సర్వే నంబర్ 119/21, 22లో ఉన్న తమ నిర్మాణాలను కూలగొట్టడంపై డీ లక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా ఏర్పాటు చేస్తూ చట్టవిరుద్ధంగా జారీ చేసిన జీవో 99 కొట్టేయాలని, దానికి ఎలాంటి చట్టబద్ధత లేదని అన్నారు.

నోడల్ ఏజెన్సీ అయిన హైడ్రా విశేషమైన అధికారాలు చెలాయించడం చెల్లదని, జీవోలోని నిబంధనలను ఉల్లంఘించేలా అధికారులు వ్యవహరిస్తున్నట్టు పేర్కొన్నారు. ఎలాంటి నోటీసు లేకుండా పట్టా భూముల్లోని నిర్మాణాలను కూల్చడం అన్యాయమని పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ చేపట్టారు. జీవోపై స్టే ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ వాదనలు వినకుండా జీవోను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయమూర్తి చెప్పారు. తదుపరి విచారణ ఈనెల 15కు వాయిదా వేశారు.