20-02-2025 01:04:21 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): మాజీమంత్రి హరీశ్రావు, మాజీ పోలీస్ అధికారి డీసీపీ కిషన్రావు తన ఫో న్ ట్యాపింగ్ చేశారంటూ రియల్ వ్యాపారి చక్రధర్గౌడ్ ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్లోని పంజాగుట్ట పీఎస్లో నమోదైన కేసులో పోలీసుల తీరును బుధవారం హైకోర్టు తప్పుబట్టింది.
కేసు విచారణ స మయంలో ఓ వైపు కోర్టులో వాయిదాలు కోరుతూ, దర్యాప్తు పేరుతో మరోవైపు అరెస్టులు చేయడాన్ని ఆక్షేపించింది. కోర్టులతో చెలగాటమాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఫోన్ ట్యాపిం గ్ కేసులో దర్యాప్తు నిలిపివేయాలని మ ధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అంతేగాకుండా ఈ కేసులో హరీశ్రావు, కిషన్ రావులను అరెస్ట్ చేయరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. పంజాగుట్ట పీఎస్లో తమపై నమోదైన కేసును కొట్టేయాలంటూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు, రిటైర్డ్ డీసీపీ పీ రాధాకిషన్రావు దాఖలు చేసిన పిటిషన్లను బుధవారం న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ విచారించారు.
పోలీసుల తరఫున పీపీ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ, ఈ కేసులో పోలీసుల తరఫున వాదించేందుకు సుప్రీం కోర్టు నుంచి సిద్ధార్థ లూద్రా హాజరుకానున్నారని, విచారణను మార్చి 3 లేదా 7వ తేదీకి వాయిదా వేయాలని కోరారు. దీనిపై స్పందించిన హరీశ్రావు తరఫు న్యాయవాది ఆర్ చంద్రశేఖర్రెడ్డి, సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు ఇప్పటికే పోలీసులు మూడుసార్లు వాయిదా కోరారని చెప్పారు.
ఇప్పుడు మళ్లీ పీపీ వాయిదా కోరడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వాయిదాల పేరుతో క్రూరమైన కుట్రతో కూడిన ప్రణాళికను అమలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అందుకే పదేపదే వాయిదాలు కోరుతున్నారని చెప్పా రు. ఈ నెల 12న విచారణ పూర్తయ్యాక 15న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారని, వాళ్లను భయపెట్టి నేరాంగీకార వాంగ్మూలాలను తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
ఈ కేసులో ఏళుt3ని అరెస్ట్ చేయడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైందని, ఆ నిందితుడి రెండేళ్ల బాలుడితోపాటు భార్యను కూడా అర్ధరాత్రి వరకు పీఎస్లో ఉంచారని మండిపడ్డారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన వారిని వేధింపులకు గురిచేసి తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని, వాటిపై హరీశ్రావు, రాధాకిషన్రావులకు వ్యతిరేకంగా అఫిడవిట్లుగా చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ పోలీసులు కోరినట్టు కేసు విచారణను వాయిదా వేస్తే పిటిషనర్లకు తీరని నష్టం జరుగుతుందని వివరించారు. ఓ ఉన్నతాధికారి సాక్షిని బెదిరిస్తూ తాము చెప్పినట్టు చేయకపోతే నరకాన్ని చూపిస్తామని అన్నారని న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. పీపీ నాగేశ్వరరావు స్పందిస్తూ కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని చెప్పడం అవాస్తవమన్నారు.
నిజంగానే పోలీసులు చిత్రహింసలకు గురి చేసిఉంటే కింది కోర్టులో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. హరీశ్, రాధాకిషన్రావు అరెస్ట్ నుంచి రక్షణ పొందారని, ఇప్పుడు కేసు దర్యాప్తు చేయరాదనడం సరికాదన్నారు. ఇక్కడ పిటిషనర్ల తరఫున కాకుండా నిందితుల తరఫున వాదనలు వినిపిస్తున్నట్లు ఉందన్నారు.
న్యాయమూర్తి కల్పించు కొని, అరెస్ట్ చేసిన వారితో పిటిషనర్లకు వ్యతిరేకంగా వాంగ్మూలాలు తీసుకుంటున్నారన్నదే న్యాయవాదుల వాదనని చెప్పారు. పోలీసులు నిందితుల నుంచి వాంగ్మూలాలను తీసుకున్నారో లేదో చెప్పాలన్నారు. ఆ వాంగ్మూలంలో పిటిషనర్లకు వ్యతిరేకంగా ఉందా లేదా అని ప్రశ్నించారు. చివరికి పీపీ వినతి మేరకు విచారణను మార్చి 3కి వాయిదా వేశారు.
నాగంపై ఎన్నికల కేసు కొట్టివేత
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి) : రాష్ట్ర శాసనసభకు 2023లో ఎన్నికలు జరిగిన సందర్భంగా అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారన్న ఆరోపణలపై నమోదైన కేసును కొట్టే యాలని కోరుతూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన కేసు లో హైకోర్టు ఊరటనిచ్చింది.
2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా శ్రీపురంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాత్రి 11.30 సమయంలో ఎలాంటి అనుమతి లేకుండా ర్యాలీ, సభ నిర్వహించడంపై అప్పటి ఎన్నికల ఫ్లయింగ్ స్కాడ్ సభ్యుడిగా ఉన్న ఇరిగేషన్ అధికారి కె.నాగేశ్వరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం నాగర్ కర్నూలు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు పరిధిలో ఈ కేసు నడుస్తోంది. తాజాగా ఈ కేసును కొట్టేయాలంటూ నాగం వేసిన పిటిషన్ను బుధవారం జస్టిస్ కె.లక్ష్మణ్ విచార ణ చేపట్టారు. విచారణ అనంతరం నాగంపై ఉన్న కేసును కొట్టివేస్తూ తీర్పును వెల్లడించారు.