అయోషిమా.. ఇది జపాన్కు చెందిన దీవి. దీనికే ‘పిల్లుల దీవి’ అని పేరు. ఇక్కడ పిల్లుల సంఖ్య చాలా అధికం. ఈ దీవి చుట్టుకొలత కేవలం 1.6 కిలోమీటర్లు మా త్రమే. ఒకప్పుడు ఈ దీవిలో మనుషుల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉండేది. కానీ ఉద్యోగ, వ్యాపారాలరీత్యా వాళ్లు చుట్టు పక్కల దీవులకు వెళ్లిపోయారు. ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం ప్రకారం మే 2023 నాటికి ఆ దీవిలో కేవలం అయిదుగురు మనుషులు మాత్రమే మిగిలారట.
ఈ దీవిలో 1945లో సుమారు 900 మంది జీవిస్తుండేవారు. 2013 నాటికి ఈ దీవిలో మనుషుల సంఖ్య 50 తగ్గింది. 2018నాటికి ఏకంగా 13కి పడిపోయింది. 2019 సంవత్సరంలో కేవలం ఆరుగురు మాత్రమే నివసిస్తుండేవారు. పిల్లులు చూడ్డానికి వచ్చే పర్యాటకుల సంఖ్య మాత్రం ఏటా పెరుగుతోంది.
వాళ్లే ఈ పిల్లులకు ఆహారాన్ని సమకూరుస్తున్నారు. అసలు ఈ దీవిలోకి పిల్లులు ఎలా వచ్చాయో తెలుసా? పూర్వం 1600 సంవత్సరాల మధ్య ఈ దీవిలో పట్టుపురుగుల పెంపకం పెద్ద ఎత్తున జరిగేది. అప్పట్లో ఈ దీవిలో చాలా ఎలుకలు ఉండేవి. వీటివల్ల పట్టుపురుగులకు తీవ్ర హాని జరుగుతుండేది.
ఈ ఎలుకల బాధ తప్పించుకునేందుకు పిల్లులను ఈ దీవిలోకి తీసుకొచ్చారు. ఇక అప్పటి నుంచి ఈ జాగాలో పిల్లులు పాగా వేశాయి. తర్వాత కాలంలో ఇక్కడి ప్రజలు చేపల వేటకు ప్రాధాన్యం ఇచ్చినా.. పిల్లులను మాత్రం వెళ్లగొట్టలేదు.