calender_icon.png 23 September, 2024 | 4:03 AM

ఖమ్మం బాధితులకు హెటిరో కోటి సాయం

06-09-2024 01:21:29 AM

కలెక్టర్‌కు చెక్కు అందజేసిన బండి పార్ధసారథిరెడ్డి

ఖమ్మం,సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): ఖమ్మం వరద బాధితుల సహాయార్థం రూ.కోటి చెక్‌ను హెటిరో డ్రగ్స్‌అధినేత, రాజ్యసభ సభ్యుడు బండి పార్ధసారధిరెడ్డి గురువారం ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్‌కు అందజేశారు. అంతేకాకుండా  లక్షలాది రూపాయలు విలువ చేసే  మందులతోపాటు వారంరోజులు రెండు అంబులెన్స్ లతో ఖమ్మంలోనే ఉండి సింధు హాస్పిటల్ డాక్టర్లు వరద బాధితులకు సేవలు అందించేలా ఏర్పాట్లు కూడా చేశారు. డాక్టర్ల బృందాన్ని, మందులు, అంబులెన్స్‌లను కలెక్టర్ సమక్షంలో వైద్యశాఖకు అప్పగించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మా ట్లాడుతూ.. మున్నేరు వరదలు తనను ఎంతగానో కలిచివేశాయని అన్నారు. తాను ఖమ్మంలోనే ఉండి చదువుకున్నానని గుర్తుచేసుకున్నారు.

గతంలో ఎన్నడూ ఇంతటి వరదలు ఖమ్మంలో సంభవించలేదని చెప్పారు. తన విరాళం నేరుగా సీఎంకు ఇవ్వవచ్చు కానీ జిల్లా వాసిగా ఈ డబ్బును జిల్లా ప్రజలకు ప్రత్యేకంగా ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అందజేయాలనే లక్ష్యంతో కలెక్టర్‌కు అందజేసినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు కూడా రూ.కోటి సాయం అందిస్తున్నట్టు  ప్రకటించారు. తన కుమార్తె జ్ఞాపకార్థం హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో 14 వందల బెడ్స్‌తో అత్యాధునికంగా సింధూ హాస్పిటల్‌ను ప్రారంభించినట్టు చెప్పారు. కష్టకాలంలో వరద బాధితులను ఆదుకున్న పార్ధసారధిరెడ్డిని కలెక్టర్ అభినందించారు.