హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్లో రాబోతున్న చిత్రం ’సత్యం సుందరం’. 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో విశ్వక్ సేన్, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో హీరో కార్తీ మాట్లాడుతూ.. ‘ఇప్పుడు తెలుగు సినిమాలంటే ’బాహుబలి’ లాంటి బిగ్ స్కేల్ సినిమాలే ఐడెంటిటీ. కానీ కొన్ని రోజుల క్రితం ఇంకో ఐడెంటిటీ కూడా ఉండేది. కే విశ్వనాథ్ గారు, పెద్ద వంశీ గారి సినిమాల్లాంటివి చేయడం కుదరదా? అనిపించేది. అప్పుడే ’96’ అనే క్లాసిక్ సినిమా తీసిన డైరెక్టర్ దగ్గర నాకోసం ఒక కథ ఉందని విన్నాను.
ఆయన స్క్రిప్ట్ లా కాకుండా నవలలా తీసుకొచ్చారు. చదివినప్పుడు చాలాసార్లు ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. ఇలాంటి కథ తన జీవితంలో జరిగిందని అరవింద్ స్వామి గారు చెప్పారు. అందరికీ పర్సనల్ గా కనెక్ట్ అయ్యే స్క్రిప్ట్ ఇది. ఇప్పటివరకు అమ్మానాన్నలు, బ్రదర్స్ సిస్టర్స్ ఎమోషన్స్ చూసాం. కానీ కజిన్స్ ఎమోషన్ ని చూడలేదు.
ఈ సినిమా చూశాక ప్రతి ఒక్కరూ వాళ్ల కజిన్స్ కి ఫోన్ చేసి మాట్లాడుతారు‘ అన్నారు. విశ్వక్సేన్ మాట్లాడుతూ.. ‘27న ’దేవర’తో ఫుల్ బాటిల్ తాగినంత హ్యాంగ్ ఓవర్ వస్తే, 28న ఆ హ్యాంగ్ ఓవర్ దిగడానికి ఒక మంచి రిఫ్రిష్మెంట్ లాంటి సినిమా ’సత్యం సుందరం‘ అన్నారు. హీరోయిన్ శ్రీదివ్య, డైరెక్టర్ ప్రేమ్ కుమార్, నిర్మాత సురేశ్ బాబుతోపాటు చిత్ర యూనిట్ సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.