calender_icon.png 2 October, 2024 | 3:57 PM

అటు భారత్.. ఇటు బంగ్లాదేశ్

17-09-2024 12:31:07 AM

ప్రాక్టీస్‌లో నిమగ్నమైన ఆటగాళ్లు

చెన్నై: టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య మరో మూడు రోజుల్లో తొలి టెస్టు ప్రారంభం కానున్న వేళ ఇరుజట్ల ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. రోహిత్ శర్మ సారథ్యంలోని 16 మంది తో కూడిన భారత జట్టు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రౌండ్‌లోనే గడిపారు. కోహ్లీ, పంత్, ద్రువ్ జురేల్, జైస్వాల్ బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు ఎక్కువ సమయం కేటాయించారు. ఇక కొత్త బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ఆధ్వర్యంలో పేసర్లు బుమ్రా, సిరాజ్‌లు బంతులు వేయగా.. టెక్నిక్స్‌కు సంబంధించిన వారిద్దరికి మోర్కెల్ పలు సూచ నలు చేశాడు. ఇక కెప్టెన్ రోహిత్ సహా జడేజా, అశ్విన్, గిల్ ఫీల్డింగ్‌లో చెమటోడ్చారు.

ముఖ్యంగా జడేజా తన ఫీల్డింగ్ నైపుణ్యాలను మరింత మెరుగపరుచుకునే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో హెడ్‌కోచ్ గంభీర్.. జడేజాకు పలు సూచనలు ఇస్తూ కనిపించాడు. మరోవైపు బంగ్లాదేశ్ కూడా తమ ప్రాక్టీస్‌ను జోరుగా కొనసాగించింది. ఆటగాళ్లు ఉదయం నుంచి మూడు సెషన్ల పాటు ప్రాక్టీస్ చేసిన ఆటగాళ్లు కోచ్ నుంచి సలహాలు, సూచనలు పొందారు. కాగా తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు చెపాక్ స్టేడియానికి పోటెత్తడం గమనార్హం. ఈ నెల 19 నుంచి తొలి టెస్టు జరగనుంది.