18-03-2025 12:38:36 AM
రాచకొండ కమిషనర్ సుధీర్బాబు
మేడ్చల్, మార్చి 17(విజయ క్రాంతి): ఐపీఎల్ 2025 సీజన్ కు సంబంధించి ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ లకు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ జి సుధీర్ బాబు అన్నారు. సోమవారం నేరేడ్ నెట్ లోని సీపీ కార్యాలయంలో డీసీపీలు, ఏసీపీలు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు, ఉప్పల్ స్టేడియం అధికారులు, సన్ రైజర్స్ టీం ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపి సుధీర్ బాబు మాట్లాడుతూ అవాంఛనీయ సంఘటనలకు అవకాశం ఇచ్చే ల్యాప్ టాప్ లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, అగ్గిపెట్టెలు, పదునైన వస్తువులు, బయట నుండి తెచ్చే తినుబండారాలు, వాటర్ బాటిల్ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని అధికారులను ఆదేశించారు. కార్లు ద్విచక్ర వాహనాలకు విశాలమైన పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు. స్టేడియం చుట్టూ దాదాపు 450 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి కదలిక నిక్షిప్తం అవుతుందని, స్టేడియం పరిసరాలు నిఘా నీడలో ఉంటాయని అన్నారు.
సివిల్, ట్రాఫిక్, రిజర్వుడ్ పోలీసులు, ఎస్ ఓ టి వంటి విభాగాల అధికారులు, ఇబ్బంది బందోబస్తు విధుల్లో ఉంటారన్నారు. టికెట్ల పంపిణీలో ఎటువంటి గందరగోళం లేకుండా చూడాలని ఐపిఎల్ నిర్వహకులకు సూచించారు. స్టేడియం ప్రవేశ మార్గాల్లో వీధి వ్యాపారులకు అనుమతించవద్దని, స్టేడియం లోపల ఆహార పదార్థాలను, శీతల పానీయాలను విక్రయించేవారు ఒకే రకమైన దుస్తులను ధరించాలని సూచించారు. ఈ సమావేశంలో మల్కాజ్గిరి డిసిపి పద్మజ, క్రైమ్ డిసిపి అరవింద్ బాబు, అడ్మిన్ డిసిపి ఇందిరా, స్పెషల్ బ్రాంచ్, ట్రాఫిక్, ఎస్ ఓ టి డి సి పి లు నరసింహారెడ్డి, మల్లారెడ్డి, రమణారెడ్డి, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.