- ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
- నేడు అల్పపీనడం ఏర్పడే అవకాశం
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): ఇప్పటి వరకు పశ్చిమ బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడగా.. తాజాగా మయన్మార్ దక్షిణ తీరంలో మరొకటి ఏర్పడినట్లు ఆదివారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రెండు ఆవర్తనాల కారణంగా రాబోయే మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆవర్తనం ప్రభావం వల్ల సోమవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, జనగామ, యాదాద్రి, రంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది. వర్ష సూచన ఉన్న జిల్లాలకు ఆదివారం ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.