హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 30-40 కిలో మీటర్ల వేగంతో గాలులతో ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ ప్రకటించింది. మియాపూర్, నిజాంపేట్, లింగంపల్లి, టోలీచౌకి, షేక్పేట్, మెహిదీపట్నం, ఆసిఫ్నగర్, కూకట్పల్లి, మాదాపూర్, కొండాపూర్, రాజేంద్రనగర్ సమీప ప్రాంతాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్ లో మూడ్రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.