సాహసం చేసిన డాక్టర్ అశోక్ బృందం
కుమ్రంభీం ఆసిఫాబాద్, జూలై 21 (విజయక్రాంతి): జైనూరు మండలం లోని లొద్దిగూడ గ్రామం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. సరైన రోడ్డు సౌకర్యం లేదు. అయినా కూడా భారీ వర్షంలోనే జైనూర్ పీహెచ్సీ డాక్టర్ అశోక్ నేతృత్వంలో ఆదివారం ఏఎన్ఎం జ్యోతి, ఆశా వర్కర్లు, 102 సిబ్బంది పరమేశ్వర్, స్థానిక సీఎస్డబ్ల్యూలు కొండలు, దట్టమైన అడవిలో కాలినడకన వైద్య సేవలు అందించడానికి గ్రామానికి వెళ్లారు. గ్రామానికి సమీపాన ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నా, లొద్దిగూడ గ్రామంలో ఉన్న గర్భిణులకు వైద్య సేవలందించేందుకు ఆ బృందం గ్రామానికి చేరుకున్నారు. భారీ వర్షాల కారణంగా గర్భిణులు సకాలంలో ఆ గ్రామం నుంచి జైనూర్ పీహెచ్సీకి తీసుకురాని పరిస్థితి ఉండటంతో డాక్టర్ అశోక్ బృందమే వారిని సీఎస్పీ ఆసుపత్రికి తీసుకువచ్చారు.