04-03-2025 12:04:31 AM
ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు
గోదావరిఖని, మార్చి 3: తనను ఓ మద్యం షాపు వ్యాపారి ఎస్సీ అనే కులం పేరుతో దూషించాడని, తనకు న్యాయం చేయాలని గోదావరిఖని అంబేద్కర్ నగర్ కు చెందిన యతిరాజు చంద్రశేఖర్ అనే యువకుడు స్థానిక జవహర్ నగర్ లో సింగరేణి స్టేడియం ప్రక్కన గల ప్రధాన వాటర్ ట్యాంకు పైకి ఎక్కి దూకుతానని హెచ్చరించాడు. దీంతో స్థానికులు తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు. గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు సైతం చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారు.
అయితే వాటర్ ట్యాంకు ఎక్కడానికి గల కారణాలు చెప్పే ప్రయత్నం చేస్తుండగానే... మద్యం మత్తులో ఉండడంతో అంతలోనే అదుపు తప్పి అమాంతం ప్రజలంతా చూస్తుండగానే వాటర్ ట్యాంక్ పై నుండి కింద పడిపోయాడు. దీంతో అతని చేయి విరిగి తీవ్ర రక్తస్రావం జరిగింది.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడిని గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు తమ వాహనంలో హుటాహుటిన గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ఈ సంఘటన చూసిన వారంతా ఒక్కసారిగా భయకంపితులు అయ్యారు. సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.