calender_icon.png 24 October, 2024 | 7:48 AM

లక్ష రూపాయలకు పసిబిడ్డను అమ్మేశాడు

24-10-2024 01:22:08 AM

  1. తల్లి ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు
  2. క్షేమంగా తల్లి చెంతకు చేరిన 10 నెలల పాప
  3. వేములవాడలో తాగుబోతు తండ్రి నిర్వాకం

సిరిసిల్ల,అక్టోబర్ 23 (విజయక్రాంతి): తాగుడుకు బానిసైన ఓ తండ్రి తన పది నెలల కూతురిని అమ్మేశాడు. కల్లుదుకాణంలో బేరసారాలు సాగించిన ప్రబుద్ధుడు రూ.లక్షకు పాపను అమ్మేందుకు జగిత్యాల జిల్లాకు చెందిన మహిళతో ఒప్పందం కుదుర్చుకుని, పాపను అమ్మేశాడు.

బిడ్డ కనిపించకపోవడంతో తల్లడిల్లిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బుధవారం చోటుచేసుకుంది. టౌన్ సీఐ వీరప్రసాద్ వివరాల ప్రకారం.. వేములవాడ పరిధిలోని తిప్పాపూర్‌కు చెందిన బత్తుల శ్యామలరాములుకు ఐదుగురు పిల్లలు.

తాగుడుకు బానిసైన రాములు చిన్నబిడ్డను అమ్మేయా లని భావించి మంగళవారం సిరిసిల్ల కల్లు మండువాలో బేరం మాట్లాడుకున్నాడు. జగిత్యాలకు చెందిన లక్ష్మితో రూ.లక్షకు పాపను విక్రయించనున్నట్టు బాండ్ పేపర్ రాసుకున్నాడు. బుధవారం తిప్పాపూర్‌కు వచ్చిన లక్ష్మికి తన పది నెలల బిడ్డను అప్పగించాడు.

కొంత సేపటికి తేరుకున్న తల్లి తన బిడ్డ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు లక్ష్మి వద్ద ఉన్న పాపను తల్లి చెంతకు చేర్చారు. పోలీసులకు శ్యామల కృతజ్ఞతలు తెలిపింది.