న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు తమ ఎన్పీఎఫ్సీ సబ్సిడరీ హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీవోకు ఆమోదం తెలిపింది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లో రూ. 2,500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీచేస్తారు. మరికొంత వాటాను ప్రస్తుత షేర్హోల్డర్లు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయిస్తారు. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కు 94.64 శాతం వాటా ఉన్నది.
నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలను (ఎన్బీఎఫ్సీలు స్టాక్ ఎక్సేంజీల్లో లిస్ట్ చేయాలంటూ 2022లో ఆర్బీఐ జారీచేసిన నిర్దేశాల మేరకు హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీవోను తీసుకొస్తున్నారు. ఇటీవల బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ విజయవంతంగా లిస్టయిన నేపథ్యంలో హెచ్డీబీ ఫిన్ కూడా ఐపీవోకు రెడీకావడం గమనార్హం. మరో రెండు ఎన్బీఎఫ్సీలు టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆదిత్యా బిర్లా ఫైనాన్స్లు కూడా పబ్లిక్ ఆఫర్లు జారీచేస్తాయని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు తెలిపారు.