25-03-2025 11:55:19 PM
రన్యారావు కేసులో కొత్త విషయం వెలుగులోకి..
బెంగళూరు: బంగారం అక్రమంగా తరలిస్తున్న కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావు కేసులో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. విదేశంలో బంగారం కొనుగోలు చేసేందుకు రన్యారావు హవాలా డబ్బును వినియోగించినట్టు విచారణలో తేలింది. ఈ విషయాన్ని రన్యారావు స్వయంగా అంగీకరించినట్టు డీఆర్ఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. బంగారం కొనుగోలు కోసం హవాలా మార్గాల ద్వారా నగదు బదిలీ చేసినట్లు విచారణలో రన్యారావు ఒప్పుకుందని తెలిపింది.
రన్యారావు బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా డీఆర్ఐ తమ విచారణలో తేలిన విషయాలను న్యాయస్థానానికి వివరించింది. ఈ సందర్భంగా ఈ కేసులో మరో నిందితుడు తరుణ్రాజ్కు రన్యారావు ఆర్థిక సహాయం చేసినట్టు విచారణలో తేలింది. ఆమె పంపిన డబ్బుతోనే అతడు దుబాయ్ నుంచి హైదరాబాద్ వెళ్లాడని అధికారులు ఆరోపించారు. బ్యాంకాక్, జెనీవాకు బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేవారని పేర్కొన్నారు. రన్యారావు, తరుణ్ రాజ్ మంచి స్నేహితులని.. వీరిద్దరు 2023లో దుబాయ్లో విరా డైమండ్స్ ట్రేడింగ్ ఎల్ఎల్సీ కంపెనీ స్థాపించినట్లు తెలిపారు. వ్యాపార భాగస్వాములుగా కొనసాగుతూ దీనిని నిర్వహిస్తున్నారని విచారణలో తేలింది.